SBI IMPS Charges 2026 : ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..ఫిబ్రవరి 15 నుంచి ఛార్జీల బాదుడు షురూ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..ఫిబ్రవరి 15 నుంచి ఛార్జీల బాదుడు షురూ
SBI IMPS Charges 2026 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఒక ముఖ్యమైన గమనిక. తక్షణ నగదు బదిలీ కోసం మనం ఎక్కువగా వాడే ఐఎంపీఎస్ (IMPS) లావాదేవీలపై ఎస్బీఐ సర్వీస్ ఛార్జీలను సవరించింది. ఇప్పటివరకు డిజిటల్ మాధ్యమాల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఉన్న వెసులుబాటులో కొన్ని మార్పులు చేస్తూ, కొత్త ఛార్జీల పట్టికను విడుదల చేసింది. ఫిబ్రవరి 15, 2026 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్సైట్ ద్వారా ఐఎంపీఎస్ (Immediate Payment Service) లావాదేవీలపై విధిస్తున్న కొత్త ఛార్జీలను ప్రకటించింది. సాధారణంగా సెకన్ల వ్యవధిలో నగదు బదిలీ అయ్యే ఈ విధానంపై ఇప్పుడు ప్రభుత్వం, బ్యాంక్ నిర్ణయం మేరకు స్వల్ప రుసుములు వర్తించనున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో (YONO) యాప్ ద్వారా చేసే లావాదేవీలకు ఇవి వర్తిస్తాయి. అయితే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా రూ.25,000 లోపు చేసే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించకూడదని బ్యాంక్ నిర్ణయించింది.
నగదు పరిమితిని బట్టి వర్తించే ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..మీరు చేసే ట్రాన్సాక్షన్ రూ.25,001 నుంచి రూ1,00,000 మధ్యలో ఉంటే, బ్యాంక్ దానికి రూ.2 సర్వీస్ ఛార్జ్, దానికి అదనంగా వర్తించే జీఎస్టీ (GST)ని వసూలు చేస్తుంది. అలాగే రూ.1,00,001 నుంచి రూ.2,00,000 వరకు చేసే బదిలీలకు రూ.6 + GST వర్తిస్తుంది. గతంలో ఉన్న పరిమితులను పెంచుతూ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చేసే పెద్ద మొత్తాల లావాదేవీలకు కూడా ప్రభుత్వం అదే రూ.6 + GSTని నిర్ణయించింది. దీనివల్ల ఎక్కువ మొత్తం పంపే వారికి ఈ ఛార్జీలు పెద్దగా భారంగా అనిపించకపోవచ్చు.
ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు మునుపటిలాగే ఛార్జీలు కొనసాగుతుండగా, కేవలం డిజిటల్ ఛానల్స్ ద్వారా చేసే వాటికే ఈ సవరణలు చేశారు. కస్టమర్లు తమ నగదు బదిలీ అవసరాలను బట్టి నెఫ్ట్ (NEFT) లేదా ఆర్టీజీఎస్ (RTGS) వంటి ఇతర ఉచిత సేవలను కూడా పరిశీలించుకోవచ్చని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. నెఫ్ట్ విధానంలో నగదు జమ కావడానికి కొంత సమయం పట్టినప్పటికీ, చాలా వరకు దీనిపై ఛార్జీలు ఉండవు.