Muthoot: భారీ నష్టాల్లో ముత్తూట్ షేర్లు..వినియోగదారుల్లో టెన్షన్
Muthoot Finance: ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ శుక్రవారం అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే.
Muthoot Finance: ముత్తూట్ గ్రూప్ చైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) అనుమానాస్పదంగా మరణించడంతో..ఆ ప్రభావం సంస్థ షేర్లపై తీవ్రంగా పడింది. సోమవారం బుల్ మార్కెట్లో ముత్తూట్ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రారంభంలో 6.57 శాతం క్షీణించి బీఎస్ఈలో సంస్థ షేరు ధర రూ.1205ల వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం 3 శాతం వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు సంస్థ చైర్మన్ మరణంతో ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. సంస్థ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండడంతో..ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని అయోమయంలో ఉన్నారు.
ఈ సందర్భంగా ముత్తూట్ ఫైనాన్స్ శనివారం ఓ సంతాప ప్రకటన విడుదల చేసింది. దీనిలో జార్జ్ ముత్తూట్ అకాల మరణంపై విచారం వ్యక్తం చేసింది. చైర్మన్ గా ఎనలేని సేవలు అందించారని, ఆ టైంలో కంపెనీ జాతీయ స్థాయిలో ఎంతో వృద్ధి నమోదు చేసిందని ప్రకటించింది. ఆయన ఆకస్మిక మరణం కుటుంబం, సన్నిహితులతోపాటు, కంపెనీకి, ఉద్యోగులకు తీరని నష్టమంటూ పేర్కొంది. కానీ చైర్మన్ మరణానికి కారణం మాత్రం కంపెనీ ప్రస్తావించలేదు.
కాగా జార్జ్ ముత్తూట్ అనుమానాస్పద పరిస్థితుల్లో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన నివాసంలోని నాలుగో అంతస్తు నుంచి పడి చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి, సీసీటీవీ ఫుటేట్ను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.