కనిపించని కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కరోనా దెబ్బకు ప్రజా జీవనం అస్తవ్యస్తం అయిపోతోంది. జీవితాలు గందరగోళ పరిస్త్తిల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక దేశాల ఆర్థిక వ్యవస్థల పరిస్థతి చెప్పక్కర్లేదు.
ఈ నేపధ్యంలో దేశంలో ప్రజల ఆర్ధిక ఇబ్బందులను తొలగించే దిశలో కొన్ని సూచనలను పరిశ్రమ సమాఖ్య (అసోచామ్) చేసింది. ఆర్ధిక మంత్రి, కోవిడ్ 19 ఎకనమిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ హెడ్ గా ఉన్న నిర్మలా సీతరామన్ కు ఈ మేరకు కొన్ని సూచనలను నేరుగా పంపించింది.
రుణ చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం..
అసోచామ్ రుణ చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం కల్పించాలని బ్యాంకులను కోరింది. కార్పొరేట్స్, ఇండివీజువల్స్కు ఈ సదుపాయాన్ని కల్పించాలని తెలిపింది. కోవిడ్ 19 వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ సూచన చేస్తున్నట్టు తెలిపింది.
ఇతర సూచనలు..
దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా ఎన్బీఎఫ్సీ సంస్థలకు వెంటనే నిధులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరిన అసోచామ్.. చట్టాలను సవరించాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న ఎన్బీఎఫ్సీలకు 100 శాతం జీఎస్టీ క్రెడిట్ ఆప్షన్ అందించాలని తెలిపింది. మొండి బకాయిలు (ఎన్పీఏ) నిబంధనలను, కేటాయింపుల విధానాన్ని కూడా సమీక్షించాలని కూడా అసోచామ్ కోరింది.
ప్రపంచంలోని ఇతరదేశాల లానే, భారత్ కూడా కోవిడ్ 19 వల్ల తీవ్రంగానే నష్టపోతోందని అసోచామ్ తెలిపింది. దేశంలో ఇప్పటికే క్రెడిట్ ఎన్విరాన్మెంట్ ఇబ్బందుల్లో ఉందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కూడా తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా శరవేగంగా విస్తరిస్తుండటం ఇబ్బందికర అంశామని అసోచామ్ నిర్మలా సీతారామన్ కు పంపిన సూచనల్లో పేర్కొంది.