RGV Slams Sivaji Again: ‘మొరిగే వాళ్లను పట్టించుకోలేదు’.. రాజా సాబ్ భామలపై వర్మ క్రేజీ కామెంట్స్!
నటీమణుల దుస్తులపై శివాజీ చేసిన అసభ్య వ్యాఖ్యలపై ఆర్జీవీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రభాస్ 'రాజా సాబ్' హీరోయిన్లు శివాజీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా తమకు నచ్చిన దుస్తుల్లోనే ఈవెంట్ కు వచ్చారని, వారికి హ్యాట్సాఫ్ అని ఆర్జీవీ పోస్ట్ చేశారు.
నటీమణుల దుస్తుల విషయంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ఇంకా మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే శివాజీని ‘అనాగరికుడు’ అంటూ తిట్టిపోసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV), తాజాగా ‘రాజా సాబ్’ హీరోయిన్లను మెచ్చుకుంటూ మరోసారి శివాజీపై విమర్శల దాడిని ఎక్కుపెట్టారు.
హీరోయిన్లకు ఆర్జీవీ హ్యాట్సాఫ్!
ఇటీవల జరిగిన ‘రాజా సాబ్’ ఈవెంట్లో హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తమకు నచ్చిన గ్లామరస్ డ్రెస్సుల్లో మెరిశారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ వారితో దిగిన సెల్ఫీని ఆర్జీవీ తన 'X' ఖాతాలో పోస్ట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పట్టించుకోలేదు: "శివాజీ మరియు అతని విషపూరిత బృందం నైతికంగా ఎంత మొరిగినా, ఈ ముగ్గురు హీరోయిన్లు ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్లకు నచ్చినట్లుగా, తమ కంఫర్ట్ ఉన్న బట్టల్లోనే వచ్చారు" అని వర్మ రాసుకొచ్చారు.
ముగ్గురు హీరోలు: ఈ ముగ్గురు భామలు శివాజీ వంటి వారికి గట్టి సమాధానం చెప్పారని, అందుకే ఈ ముగ్గురు ‘హీరోలకు’ హ్యాట్సాఫ్ చెబుతున్నానని తనదైన శైలిలో చురకలు అంటించారు.
అసలు వివాదం ఏమిటి?
‘దండోరా’ మూవీ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు పద్ధతిగా దుస్తులు ధరించకపోతే వారిని ‘దరిద్రపు ము***’ అని, శరీర భాగాలను ‘సామాను’ అని అత్యంత అభ్యంతరకర పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించడంతో.. తాను కొన్ని అనుకోని పదాలు వాడానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని శివాజీ గతంలో ప్రకటించారు.
శివాజీని వదలని వర్మ!
శివాజీ క్షమాపణలు చెప్పినా ఆర్జీవీ మాత్రం ఆయనపై ఆగ్రహం తగ్గించుకోలేదు.
"నీ నీతిబోధలేవో నీ ఇంట్లో వాళ్లకి చెప్పుకో.. ఇతరుల విషయంలో నీ అభిప్రాయాలను నీ దగ్గరే పెట్టుకో" అంటూ అంతకుముందే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ‘మొరగడం’ అనే పదాన్ని వాడుతూ శివాజీని టార్గెట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.