వచ్చే ఏడాది జనవరి 9న వైసీపీ అభ్యర్థుల మొదటి జాబితాను జగన్ ప్రకటించే అవకాశముంది. ఆరోజు పాదయాత్ర ముగింపు సందర్బంగా జగన్ మొదటి జాబితాను అనౌన్స్ చేసే అవకాశంస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నందున వీలైనంత తొందరగా ఈ పని పూర్తి చేస్తే మేలనే భావనలో జగన్ ఉన్నారు. పైగా ప్రచారం చేసుకోవడానికి అభ్యర్థులకు చాలా సమయం ఉంటుందని అనుకుంటున్నారు. మొదటి జాబితాలో 120 నుంచి 150 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం. అలాగే 7 నుంచి 11 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించనున్నారు.
దాంతో ఎవరికీ సీటు దక్కుతుందో అని వైసీపీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ నుండి పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనంటూ క్లారిటీ ఇచ్చేశారు జగన్. కాగా కొన్ని చోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నవారిని మార్చి కొత్తవారిని నియమిస్తున్నారు. వీరిలో కొంతమంది సర్దుకుపోయినా ఒకరిద్దరు అసంతృప్తిగా ఉన్నారు. మార్పులు చేర్పులు చోటు చేసుకున్న పరిణామంలో ఎవరి సీటుకి గ్యారెంటీ ఉందో ఎవరి సీటు గల్లంతో అని నేతలు లోలోపల మదన పడుతున్నారు.