తిరుపతిలో భారీగా మద్యం, మాంసం కలకలం
అలిపిరి టోల్గేట్ వద్ద మద్యం, మాంసం కారులో తరలిస్తున్న ఘటన కలకలం రేపుతోంది.
అలిపిరి టోల్గేట్ వద్ద మద్యం, మాంసం కారులో తరలిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్నఓ వ్యక్తి తన కారులో 11 లీటర్ల మద్యం, ఐదు కిలోల చికెన్ను తిరుమల కొండపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
అలిపిరి టోల్గేట్ బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్వో శ్రీ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి చెందిన శ్రీ ఎన్.వెంకటముని కారులో తిరుపతి నుండి తిరుమలకు వెళుతుండగా అలిపిరి టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. కోవిడ్-19నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత పదార్థాలను తిరుమలకుతీసుకెళుతుండడంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
ముందు సీటు కింది భాగంలో నిషేధిత పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 5 కిలోల మాసం , సిగ్నేచర్ విస్కీ 4 బాటిళ్లు, ఓట్కా -2 బాటిళ్లు, లూజ్ లిక్కర్ -2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమలలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కాగా, శ్రీ వెంకటమునిపై గతంలో నమోదైన ఒక కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.