భీమునిపట్నం: విశాఖపట్నం నగర అధ్యక్షులుగా ఎన్నికైన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ భాద్యతలు స్వీకరించినందున తెలుగుదేశం పార్టీ భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు, తగరపువలస డివిజన్ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు సమక్షంలో ఆయనను గజమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గంటా నూకరాజు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులుగా వాసుపల్లి గణేష్ కుమార్ ని నియమించినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, గతంలో వాసుపల్లి గణేష్ కుమార్ నగర అధ్యక్షులుగా ఉండే సమయంలో తెలుగుదేశం పార్టీ పటిష్టం కోసం అహర్నిశలు కష్టించి పనిచేశారని, సందర్భానుసారం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేయడం ద్వారా కార్యకర్తలకు ఎంతో దగ్గరయ్యారని, విశాఖపట్నం జిల్లాలో ఉండే నాయకులను, కార్యకర్తలను ఒక తాటిమీదకు తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేశారని కొనియాడారు.
ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా విశాఖపట్నం తెలుగు తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ముందుంటారని అందుకే ఏ సామాజిక వర్గం అయినా వాసుపల్లిని అభిమానించకుండా ఉండలేరని గంటా నూకరాజు అన్నారు.