మద్యం అమ్మకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
మద్యం అమ్మకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మద్యం అమ్మకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాల్లో ఆన్లైన్ డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. లాక్డౌన్లో భాగంగా కేంద్రం సడలింపుల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 45 రోజుల తర్వాత ఒక్కసారిగా వైన్ షాపుల తీయడంతో మందుబాబులు దుకాణాల ముందు బారులు తీరారు. ముంబైలో ఈ రద్దీ ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల్లోనే వైన్ షాపులను మళ్లీ మూసివేశారు.
లాక్డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు ప్రజల జీవితంపై ప్రభావం చూసే ఉందని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. ఈ నేపథ్యంలో మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించడానికి, జనాలు గుమిగూడకుండా ఉండేందుకు హోం డెలివరీ ఉపకరిస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
మద్యం షాపుల ముందు రాష్ట్రాలు భౌతిక దూరం నిబంధన అతిక్రమించకుండా ఉండేందుకు మద్యం అమ్మకాల్లో హోం డెలివరీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ దీపక్ సాయి.. 'మద్యం దుకాణాల ముందు సామాజిక దూరం నిబంధన పాటించడం కుదరదు. రాష్ట్రాల్లో పరిమితంగా షాపులు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. దీంతో వాటి ముందు పెద్ద సంఖ్యలో జనాలు క్యూలు కడుతున్నారు. మద్యం అమ్మకాల వల్ల సామాన్యుని జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేదే మా కోరిక. దీనిపై కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు తప్పకుండా స్పష్టత ఇవ్వాలి' అని కోరారు. ఇప్పటికే పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలల్లో మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు అందజేస్తున్నారు.