వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బొల్లాపల్లి తహశీల్దార్ బాలకృష్ణ మధ్య వాగ్వాదం జరిగింది. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వేదికపైనే అధికారులపై విరుచుకుపడ్డారు. బొల్లాపల్లి మండలానికి ఆదినుంచీ కష్టాలేనన్న ఎమ్మెల్యే బొల్లా మండలంలో 900కి పైగా సర్వే నెంబర్లు ఉంటే, 600 సర్వే నెంబర్లకు ఆన్లైన్ రికార్డులు లేవంటూ ప్రశ్నించారు. అసలు సర్వే నెంబర్లను ఎందుకు ఆన్లైన్ చేయలేదంటూ వేదికపైనే ఉన్న తహశీల్దార్ బాలకృష్ణను ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
ఎమ్మెల్యే బొల్లా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బొల్లాపల్లి తహశీల్దార్ బాలకృష్ణ తానేమీ తాళికట్టి ఇక్కడికి రాలేదంటూ కౌంటరిచ్చారు. సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చానని, వద్దనుకుంటే వెళ్లిపోతానంటూ వ్యాఖ్యానించారు. ఎవడొచ్చినా ఈ సమస్యలు పరిష్కరించలేడంటూ ఎమ్మెల్యే ముఖం ముందే చెప్పేశారు. 36 సంవత్సరాలుగా పనిచేస్తున్నా... 10సార్లు ఉత్తమ అవార్డు అందుకున్నా 2సార్లు గవర్నర్ నుంచి అభినందనలు అందుకున్నా ఇవన్నీ గుర్తించే కలెక్టర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారన్న తహశీల్దార్ తన పని మీకు నచ్చకపోతే ఈరోజే వెళ్లిపోతానంటూ ఎమ్మెల్యేకు సమాధానమిచ్చారు. జాయింట్ కలెక్టర్ ముందే ఈ గొడవంతా జరిగింది.
తహశీల్దార్ తీరుపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. తాను ఇప్పుడే వచ్చానంటున్నారని, పైగా త్వరలో రిటైర్ కాబోతున్నానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడంటూ ఫైరయ్యారు. మీకు ఒక నెల జీతం ఆలస్యమైతే ఊరుకుంటారా? అంటూ తహశీల్దార్ను ప్రశ్నించిన ఎమ్మెల్యే బొల్లా మరి సర్వే రికార్డులు ఆన్ లైన్ చేయకపోతే రైతులకు ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఎలా వస్తాయని నిలదీశారు. కలెక్టర్ కల్పించుకుని రైతులకు న్యాయం చేయాలని, లేదంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తానని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హెచ్చరించారు.