కంపెనీని విస్తరించేందుకు 2017లో చంద్రబాబే అనుమతి ఇచ్చారు : మంత్రి కొడాలి నాని

టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2020-05-09 12:16 GMT
Minister Kodali Nani, Chandrababu Naidu (file photo)

టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.విశాఖ గ్యాస్ దుర్ఘటన బాధితులను ఆదుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు రాజకీయం చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనావాసాల మధ్య ఉన్న ఈ కంపెనీని విస్తరించేందుకు అనుమతి ఇచ్చారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

గతంలో హిందూస్థాన్ కంపెనీని కొరియన్ కంపెనీ కొనుగోలు చేసే విషయంలోనూ చంద్రబాబు మధ్యవర్తిత్వం వహించారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1998లో ఇదే కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిందని,అనేక మంది గాయాలపాలై ఇప్పటికీ బాధపడుతున్నారని తెలిపారు. ఈ కంపెనీని ఎందుకు మూయించలేదని కొడాలి నాని ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు సరైన పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబు చేతులు రాలేదని ఇప్పుడు సీఎం జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటిస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు విశాఖకు రావడానికి చంద్రబాబుకు ధైర్యం చాలడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

వలస కూలీలు కూడా నడుచుకుంటూ తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని,కానీ చంద్రబాబు మాత్రం ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదని విమర్శించారు. విశాఖ బాధితులను పరామర్శిస్తే తనకు ఎక్కడ కరోనా వస్తుందో అని ఆయన భయపడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఐఏఎస్ లతో వేసిన కమిటీ కంటే టీడీపీ పార్టీ వేసిన ముగ్గురు ఎమ్మెల్యేల కమిటీ గొప్పదన్నట్టుగా చంద్రబాబు ఫీలవుతున్నారని మండిపడ్డారు. 

Tags:    

Similar News