మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన మంత్రి బాలినేని
ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తొమ్మిదిమంది అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తొమ్మిదిమంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలోని మాచవరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంగతి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. విద్యుత్ ఘటన లో రైతు కూలీలు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మృతి చెందిన కుటుంబసభ్యులకు ''5'' లక్షల నష్టపరిహారం ప్రకటించారు.
మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఇక గాయ పడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తామన్నారు. ఘటనాస్థలికి అధికారులు చేరుకొని సహాయచర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా మృతులంతా సమీపంలోని మిరప తోటలో మిరపకాయలు కోసి ఇంటికి తిరిగి వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో దాదాపు 30 మంది కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది.