గణతంత్ర దినోత్సవం అంటే... జెండా ఎగరేసి, జనగణమన పాడి.. జైహింద్‌ చెప్పడం కాదు : పవన్ కళ్యాణ్

Update: 2020-01-26 07:16 GMT

గణతంత్ర దినోత్సవం అంటే... జెండా ఎగరేసి, జనగణమన పాడి.. జైహింద్‌ చెప్పడం కాదు : పవన్ కళ్యాణ్ కళ్యాణ్‌ పేర్కొన్నారు. దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారని, ఆ త్యాగాల గురించి తెలుసుకుంటే మన దేశానికి, జెండాకు మనం ఇచ్చే గౌరవమే వేరుగా ఉంటుందని అన్నారు. రిపబ్లిక్‌ డే అంటే ఒక్క రోజు జరుపుకొనే పండగలా కాకుండా... అనునిత్యం దేశ సమగ్రతను కాపాడుకునే బాధ్యతగా ఉండాలని అన్నారు. 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ... "1950వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు మన దేశంలో బ్రిటీష్‌ చట్టాలన్నీతొలగిపోయి... భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవ్వడం మొదలైంది. వందలాది సంస్థానాలను తనలో విలీనం చేసుకొని భారతదేశం రిపబ్లిక్‌ దేశంగా అవతరించింది. మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి పాకిస్థాన్‌ ఏర్పడినప్పుడు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం గొప్పతనం ఏంటంటే అన్ని మతాలు, మత విశ్వాసాలను సమానంగా గౌరవం ఇస్తుంది. కనుకే హిందు రిపబ్లిక్‌ గా దేశాన్ని ప్రకటించలేదు. ఆ అవసరం పాకిస్థాన్‌ కు ఉందేమోగానీ, భారతదేశానికి లేదు. మన గుండెల్లోనే సెక్యులరిజం ఉంటుంది. మానవత్వానికి స్పందించే దేశం మనది. ఈ దేశం కోసం మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు చేశారు. వాళ్ల శ్రమతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని అనుక్షణం మనం కాపాడుకోవాలి. దేశ సమగ్రతను కాపాడుకోవడానికి అందరూ బాధ్యతతో వ్యవహరించాలి, అవసరమైన త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, అధికార ప్రతినిధులు పోతిన వెంకట మహేష్‌, అక్కల రామ్మోహన్‌ రావు(గాంధీ) సుందరపు విజయ్‌ కుమార్‌, డాక్టర్‌ గౌతమ్‌, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌, ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌ ఛార్జ్‌ షేక్‌ రియాజ్‌, పార్టీ నేతలు ముత్తంశెట్టి కృష్ణారావు, బత్తిన రాము, సయ్యద్‌ జిలానీ, సందీప్‌ పంచకర్ల తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News