నందమూరి బాలకృష్ణకు వైఎస్ జగన్ ఫ్యాన్. కేవలం ఫ్యాన్ కాదు. డైహార్డ్ ఫ్యాన్. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘానికి ప్రెసిడెంట్. ఏంటీ బాలయ్యకు జగన్ వీరాభిమానా నిజమా అవును అంటూ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. సమరసింహారెడ్డి 365 డేస్ సందర్భంలో, జగన్ పత్రికా ప్రకటన ఇచ్చారన్నది దాని సారాంశం. నిజంగా, జగన్ బాలకృష్ణ ఫ్యానా ఇందులో నిజముందా ఇప్పుడే ఈ ఫోటో ఎందుకు వైరల్ అవుతోంది ఫోటో వెనక అసలు స్టోరీ ఏంటి?
ఒక్క ఫోటో వంద మాటలు చెబుతుంది ఒక్క చిత్రం ఎన్నో సంచనాలకు కేంద్రబిందువు అవుతుంది. ఒక్క స్నాప్ ఎన్నో గొడవలకు దారి తీస్తుంది అలాంటి ఒక సంచలన చిత్రమే ఈ ఫోటో. ఈ ఫోటో బాలయ్య సూపర్ హిట్ మూవీ సమరసింహారెడ్డి. ఈ సినిమా 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, న్యూఇయర్ విషెస్ చెబుతూ పేపర్లో ఇచ్చిన యాడ్. 'సమర సింహా రెడ్డి' సినిమా విడుదలై ఏడాది కావొస్తున్న తరుణంలో, 2000 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అదీ కూడా కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా.
జగనేంటి బాలకృష్ణ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ ఏంటి వినడానికి, చూడ్డానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది నిజమంటూ సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతోంది. టీడీపీ సోషల్ మీడియా విభాగం, బాలయ్య అభిమానుల సంఘమని చెప్పుకుంటున్న ఒక గ్రూపు, ఈ ఫోటోను వైరల్ చేస్తోంది. ఇంతకీ ఈ ఫోటో నిజమేనా జగన్ నిజంగానే బాలయ్య వీరాభిమానా. ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటో తెలుసా అవును. నిజంగా నిజమిది. నేటి సీఎం వైఎస్ జగన్, నాడు బాలకృష్ణ డైహార్డ్ ఫ్యాన్. సరే. ఈ ఫోటో ఇప్పుడెందుకు చక్కర్లు కొడుతోంది. దీని వెనక స్టోరి తెలుసుకోవాలంటే, ఒక్కసారి గతం తాలుకు రీళ్లు తిప్పాల్సిందే.
అసలు రాజకీయాలతో జగన్కు ఎలాంటి సంబందంలేని రోజులవి. సరిగ్గా చెప్పాలంటే అప్పుడు జగన్ వయసు పాతికేళ్లు. సమర సింహారెడ్డి మూవీ 2000 సంవత్సరం జనవరిలో, 365 రోజులు జరుపుకుంది. నాడు వైయస్ జగన్ వయసు 25 ఏళ్లు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. నాడు చంద్రబాబు సీఎం. తన తండ్రి వైయస్సార్ ఏపీ ప్రతిపక్ష నేతగా దూకుడు మీదున్నారు. హైదరాబాద్ ప్రగతి కాలేజీలో డిగ్రీ చేసిన జగన్, అప్పుడే బిజినెస్ గురించి రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. అయితే అదే టైంలో జగన్ ఒక హీరో సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉంటే, ఆ పార్టీకి వ్యతిరేకంగా నెలకొల్పిన నాయకుడి వారసుడి అభిమాన సంఘం జిల్లా ప్రెసిడెంట్. అంటే అర్థమైందిగా, కడప జిల్లా హీరో బాలకృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడు జగన్.
బాలకృష్ణ అంటే జగన్కు విపరీతమైన అభిమానమట. తండ్రి ఉన్న పార్టీ వేరు ఆయన అభిమానించే కథానాయకుడి కుటుంబ కథ వేరు. అయినా ఒక హీరోను అభిమానించడంలో అవన్నీ ఆలోచించలేదు జగన్. పరుగులు పెట్టే వయసులో స్వతంత్రంగా ఆలోచించారు. తండ్రి పాలిటిక్స్కు తన అభిమానానికి సంబంధం లేదనుకున్నారు జగన్. ప్రతిపక్ష నేత తనయుడిగా తనకు నాటి రాజకీయాలతో సంబంధం లేదంటూ, ఆ హీరోపై తన అభిమానాన్ని ఏమాత్రం దాచుకోలేదు.
బాలకృష్ణ నటించిన సినిమా విడుదలైతే, కడప జిల్లాలో హంగామా బాధ్యతలను జగన్ తీసుకొనేవారట. అలాగే, పత్రికల్లోనూ తన అభిమానాన్ని చాటుకుంటూ ప్రత్యేకంగా ప్రకటనలు ఇచ్చేవారట. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా 2000వ సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన ఒక ప్రకటన, ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాడు సినిమా హీరోగా బాలకృష్ణను జగన్ అభమానించిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే, యుక్త వయస్సులో బాలయ్య మీదున్న అభిమానం, సీఎంగానూ నేడుందా అన్నదే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.
తండ్రి మరణం తర్వాత జగన్ జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఇంకెన్నో మలుపులు తిరిగింది. పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇక, వైసీపీ స్థాపించిన తరువాత, పార్టీ కార్యకలాపాలకే డెడికేట్ అయ్యారు. బాలకృష్ణ అభిమాని అయిన జగన్ తన హీరోను ఒక ఎమ్మెల్యేగా, 2014లో చూశారు. అప్పుడు శాసనసభలో జగన్ ప్రతిపక్ష నేత. 2014, 2019లోనూ బాలకృష్ణకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బాలకృష్ణను ఏకంగా అసెంబ్లీలో విమర్శించారు. ఓ సినిమా ఫంక్షన్లో మహిళలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ అధినేతగా, తన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోరా అంటూ చంద్రబాను నిలదీశారు జగన్. అంటే అభిమానం అభిమానమే, బాధ్యతలు బాధ్యతలే. అందులో ఎలాంటి మినహాయింపునివ్వలేదు జగన్. ఉడుకు వయస్సులో ఏదో అభిమానం చూపినా, ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉంటారని భావించడానికి వీల్లేదు. అలాగని అభిమానించడం మానేశారనీ చెప్పలేం. ఎవరి వ్యక్తిగతం వారిదే.
అయితే ఈ ఫోటో ఫేక్ అంటూ సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ జరుగుతోంది. ఫోటోపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో కౌంటర్ అటాక్ ఇచ్చింది వైసీపీ. వై.యస్. జగన్మోహన్ రెడ్డి 2003లో తన భార్య భారతితో ఒక గార్డెన్లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 2003లో దిగిన ఫోటో, 1999 సంవత్సరం చివర్లో ఎలా ప్రత్యక్షమైందంటూ క్వశ్చన్ చేస్తున్నారు. 1999, 2003 అంటూ రెండు ఫోటోలనూ పక్కపక్కనే పెట్టి కంపార్ చేస్తున్నారు.
అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. పాతికేళ్ల వయసులో జగన్, బాలయ్య అభిమాని. ఒక ఇంటర్వ్యూలో జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఈ విషయం స్పష్టం చేశారు. ఇప్పుడెందుకో బాలయ్య అభిమానులు, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.