తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు.. మరో రెండు రోజుల పాటు..

Update: 2020-10-19 01:11 GMT

తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడింది. రాగల 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్లు హెచ్చరించింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు, తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇవాళ రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు

రాబోయే మూడు రోజుల పాటు హైదరబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావారణ శాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల కుటుంబాలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. గత వారం రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదా, బురదతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వర్ష సూచనపై నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

ఎగువ నుంచి వస్తున్న నీటితో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.340మీటర్లుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 5.699టీఎంసీలకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 49 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 5,47,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 6,03,468క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Tags:    

Similar News