అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున వరదలు
అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున వరదలు అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున వరదలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లా వర్షార్పణం అయింది. జిల్లాలోని అన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత పెద్దఎత్తున వరదలు వచ్చాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ, వరి పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలకు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం పిన్నేపల్లి చెరువు తెగిపోవడంతో గ్రామం నీట మునిగింది. ఇళ్లను ఒక్కసారిగా వరద చుట్టు ముట్టింది. అలాగే గుత్తిలో 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
జిల్లాలోని బెలుగుప్ప, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇటు విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద 63 జాతీయ రహదారిపై వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బళ్లారి-గుంతకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదలు కొన్ని చోట్ల విషాదాన్ని మిగిల్చాయి. పెద్దవడుగూరు మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో భారీ వర్షాలకు గుడిసె గోడ కూలి వైష్ణవి అనే ఏడేళ్ల చిన్నారి మృతిచెందింది. వేములపాడు వద్ద వరద నీటిలో వంద గొర్రెలు, యాభై పశువులు కొట్టుకుపోయాయి.