Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తాగునీటి ఇక్కట్లు
Srikakulam: మాములు రోజుల్లో కూడా రంగుమారిన నీళ్లే
Representative Image
Srikakulam: ప్రజల ఆరోగ్యంగా ఉండాలంటే తాగునీరు చాలా అవసరం. అందుకే ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నామని అధికారులు, నాయకులు చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. పన్నులు, చెత్త చెదారం తీయడానికి కూడా ఛార్జీలు చెల్లించే ప్రజలకు.. తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రస్తుత మన్యంజిల్లా అయిన పాలకొండ నగర పంచాయితీలో మంచినీటిని అందించే కుళాయిల పరిస్ధితి చాలా అద్వాన్నంగా ఉంది. ఈ పాలకొండ ప్రజలకు రక్షితనీరు అందించే పైపులు చెత్తపేరుకు పోయి ఉన్నాయి. కుళాయిల ద్వారా అందించే నీరే వీరికి ప్రధాన ఆధారం. బావులనీరు, బోరునీరు, ఉప్పునీరే వస్తాయి. దీంతో నగర పంచాయితీ అందించే నీరే వీరికి ప్రధాన ఆధారం అయ్యింది.
22 వార్డులు ఉండే ఈ పంచాయితీలో ఎక్కడ చూసినా కుళాయి గొట్టాలు పగిలిపోయి మురుగు నీరులో ఉంటాయి. అలాగే కుళాయిలు ఉన్న చోటే చెత్తా ,చెదారంతో ఉన్నాయి. మాములు రోజుల్లో కూడా రంగుమారిన నీళ్లే ఎక్కువగా వస్తాయి. ఇక వర్షాకాలం వస్తే అంతే సంగతి. నాన్ అమృత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 54 కోట్లు మంజూరు చేసింది. వీటి స్థానంలో కొత్తవి వేస్తామంటూ అధికారులు పాలకులు చెప్పడమే తప్ప కార్యాచరణ దాల్చడం లేదు.
పట్టణంలో నాలుగు రక్షిత పథకాలు ఉన్నాయి. నగర పంచాయితీకి ఎదురుగా ఒకటి, వెంకమ్మపేటలో వీధిలో ఒకటి, ఈ రెండు నిర్మంచి సుమారు 30 సంవత్సరాలు అయ్యింది. ఈ రెండు ట్యాంకులు చూస్తే దారుణంగా ఉంటాయి. 10 సంవత్సరాల క్రితం మరో రెండు నిర్మించారు. ఈ ట్యాంకుల నుండి వచ్చిన నీరు మరీ దారుణంగా ఉంటుంది. పైపులు పగిలి ఉన్నాయి. వడపోత చేసుకొని నీరు తాగుతున్నామని మహిళలు వాపోతున్నారు. కనీసం తాగునీరైనా సక్రమంగా ఇవ్వరు. ఇచ్చిన నీరైనా తాగే విధంగా ఉంటే బాగుంటుందంటున్నారు. ఈ నీరు తాగి రోగాల భారిన పడుతున్నామని నగరవాసులు మొరను విని అధికారుల్లో చలనం రావాలని వారంటున్నారు.