వైఎస్ విగ్రహం ధ్వంసం: గుంటూరులో ఉద్రిక్తత
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ద్వంశం చేసిన ఘటన గుంటూరులో ఉద్రిక్తతలకు దారి తీసింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ద్వంశం చేసిన ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. గుంటూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం గుంటూరు సమీపంలోని కాకుమాను చౌరస్తాలో ఉన్న వైఎస్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, వైసీపీ నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు డిమాండ్ చేయగా, కేసును నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ కెమెరాలు పరిశీలించి, నిందితులను గుర్తిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలు శాంతించి తమ నిరసనను విరమించారు.