కర్నూల్ : నిశ్చితార్ధ వేడుకలో కరోనా కలకలం..
ఏపీలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్న సంగతి చూస్తూనే ఉన్నాం. కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల్లో కర్నూల్ కూడా ఒకటి..
ఏపీలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్న సంగతి చూస్తూనే ఉన్నాం. కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల్లో కర్నూల్ కూడా ఒకటి.. ఇక్కడ రోజూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే జిల్లాలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో కరోనా కలకలం రేగింది. చాగలమర్రికి చెందిన యువతికి కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన యువకుడితో రెండ్రోజుల కిందట వివాహ నిశ్చితార్థం జరిగింది. అబ్బాయి తరపువాళ్లంతా విజయవాడ నుంచి కడపకు విమానంలో వచ్చారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన కర్నూల్ జిల్లా చాగలమర్రి చేరుకున్నారు. ఆ తరువాత అమ్మాయి తరుపు వారు నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేశారు.
కొద్దిసేపటికి ఈ కార్యక్రమంలో సందడిగా మొదలై సంతోషంగా ముగిసింది.. తీరా ఇప్పుడు ఆ ఫంక్షన్లో పాల్గొన్న వారిలో కొందరిని పరీక్షించగా.. కరోనా అని పాజిటివ్ రావడంతో అంతా ఒక్కసారి కలవరపాటుకు గురయ్యారు. అబ్బాయి తోపాటు అతని తల్లిదండ్రులకు పరీక్షల్లో కరోనా నిర్థారణ అయింది. దాంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే.. ఈ శుభకార్యంలో ఎవరెవరు పాల్గొన్నారో వారందరిని హోంక్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. దీంతో ఎవరికీ ఏమౌతుందో అని టెన్షన్ తో ఆందోళన చెందుతున్నారు.