Andhra Pradesh: ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు ఆమోదం
రాష్ట్రంలోని నలభై వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్య తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసన సభ గురువారం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని నలభై వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్య తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసన సభ గురువారం ఆమోదం తెలిపింది. అదే విధంగా ఈ బిల్లుకు మండలి చేసిన సవరణలను తిరస్కరించింది. దీంతో మండలిలో టీడీపీ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ బిల్లును మండలిలో తిరస్కరించారని మండిపడ్డారు.. ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిపై వివిధ సభ్యులు సభలో మాట్లాడారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన చట్టాన్ని సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లును అసెంబ్లీ సహా మండలిలో ఆమోదించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో మండలిలో పలు సూచనలు చేసింది టీడీపీ. ఆ సూచనలపై చర్చించేందుకు ఇవాళ మరోసారి సమావేశం అయింది సభ. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ చట్టానికి చేసిన సవరణలను ఆమోదించారు.