రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాజధాని అమరావతిలో జరిగే వివిధ అంశాలపై 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరుగుతోంది.
అమరావతి: రాజధాని అమరావతిలో జరిగే వివిధ అంశాలపై 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరుగుతోంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చించారు. రాజధానిలో అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైనా సమీక్షించారు.
ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సమీక్ష చేశారు. రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన యోగా, నేచురోపతి సెంటర్ నిర్మాణంతో పాటు పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. అమరావతిలో పంపింగ్ స్టేషన్లు, జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు సంబంధించి చర్చించి ఆమోదం తెలియజేశారు.
జరీబు- మెట్ట భూముల వర్గీకరణపై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారు. సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.