పెగాసస్‌ నివేదికపై దద్ధరిల్లిన అసెంబ్లీ.. 15 మంది టీడీపీ సభ్యులు ఒకరోజు సస్పెన్షన్‌

Pegasus: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.

Update: 2022-09-20 08:48 GMT

పెగాసస్‌ నివేదికపై దద్ధరిల్లిన అసెంబ్లీ.. 15 మంది టీడీపీ సభ్యులు ఒకరోజు సస్పెన్షన్‌

Pegasus: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి. అసెంబ్లీలో డేటా చోరీపై మధ్యంతర నివేదిక సమర్పించిన ఆయన.. సేవామిత్ర అనే యాప్‌తో డేటా చోరీ జరిగిందన్నారు. 30 లక్షలకు పైగా ఓటర్లను రద్దు చేసే యత్నంతోనే డేటా చోరీ జరిగిందని, వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని అభిప్రాయపడ్డారు.

దీనిపై మరింత లోతుగా విచారణ జరపించాల్సిన అవసరం ఉందని అన్నారు భూమన. ఓట్లు వేయనివాళ్ల సమాచారాన్ని స్టేట్‌ డేటా సెంటర్‌ నుంచి సేవా మిత్ర అనే యాప్‌ ద్వారా పూర్తిగా చోరీ చేసే యత్నం చేశారని, ఆ చౌర్యం చేసిన చోరులను పట్టుకోవాల్సిన బాధ్యతను తాము లోతుకు వెళ్లి విచారిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ నివేదికను స్పీకర్‌కు చదివి వినిపించారు భూమన.

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. 15 మంది టీడీపీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారం సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు.. 'సంక్షోభంలో సంక్షేమం' అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు ఆర్డర్ ప్రకారం జరగకపోవడంపై అభ్యంతరం తెలిపారు. స్పీకర్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమైన అంశాలను, ప్రశ్నలను ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మద్యం, లేపాక్షి భూములు లాంటి అంశాలపై సభలో చర్చ జరగకపోవడంపై స్పీకర్ ఛాంబర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో పదేపదే సభను అడ్డుకుంటున్నారని స్పీకర్‌ చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News