టికెట్ రిజర్వేషన్లను ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. అందులో భాగంగానే ఆన్లైన్ రిజర్వేషన్లను మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు హైదరాబాద్తో పాటూ తెలంగాణకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్డ్ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ ఏపీఎస్ఆర్టీసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణాలో కూడా లాక్ డౌన్ కొనసాగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలు ఇవ్వడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ని కొనసాగిస్తే మాత్రం ఇప్పటివరకు రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము రీఫండ్ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఆర్టీసీ టిక్కెట్ల రిజర్వేషన్ను అధికారులు నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42,377 టిక్కెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి.
ఇక ఏపీలో కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు.. నిన్న(బుధవారం) తొమ్మిది గంటల్లో మరో 34 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గుంటూరులో 8, అనంతపురంలో ఏడు , ప్రకాశంలో జిల్లాలో మూడు, పశ్చిమ గోదావరిలో ఒకరికి పాజిటివ్ తేలింది. కాగా.. విశాఖలో ముగ్గురు రోగులు కోలుకున్నారు. తాజా కేసులుతో ఏపీలో 348మంది కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 9 మంది వైరస్ నుంచి కోలుకోగా.. నలుగురు ఈ మహమ్మరి బరినపడి మరణించారు.