Rayalaseema Lift Irrigation Project: రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు.. మరోవైపు చేపట్టొద్దని ఎన్జీటీ ఆదేశాలు

Rayalaseema Lift Irrigation Project: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ ప్ర‌భుత్వం టెండ‌ర్లు ఆహ్వానించింది. ఈ నెల 27వ తేదీ నుంచి టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారి చేసింది.

Update: 2020-07-27 15:56 GMT
Andhra pradesh

Rayalaseema Lift Irrigation Project: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ ప్ర‌భుత్వం టెండ‌ర్లు ఆహ్వానించింది. ఈ నెల 27వ తేదీ నుంచి టెండర్లు స్వీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారి చేసింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్ళింది. అనంతరం జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు అధికారులు. ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దాదాపు రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం అదే నెల 19న టెండర్‌ను ఖరారు చేస్తారని అధికారులు వెల్లడించారు.

ఇందులో ఎవరు తక్కువకు కోట్ చేస్తే వారికే పనులు దక్కుతాయని తెలిపారు. కాగా శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 (మూడు టీఎంసీలు) క్యూసెక్కుల నీరు లిఫ్ట్ చేసే లక్ష్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇంజనీర్లు రూపకల్పన చేసినట్టు అధికారులు చెప్పారు. ఇదిలావుంటే తాము నియమించిన కమిటీ నివేదిక వచ్చేంతవరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టొద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై జోనల్‌ బెంచ్‌ ఏపీ‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ, జల్‌శక్తి, కేంద్ర జలసంఘం, కృష్ణానది యాజమాన్య బోర్డుల అనుమతులు లేకుండానే ఈ ఎత్తిపోతల నిర్మిస్తున్నారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీని ఆశ్రయించారు.   

Tags:    

Similar News