చేతిలో పనిలేదు కడుపు నిండా భోజనం లేదు దీంతో ఎలాగోలా సొంతూళ్లకు చేరుకోవాలన్న ఆలోచనతో కాలినడకను నమ్ముకున్నారు వలస కూలీలు. వందల కిలోమీటర్లు ఉన్నా లెక్క చేయకుండా పిల్లా జెల్లాతో నడిచిపోతున్నారు. అలాంటి వలస కూలీల కష్టాలకు చలించిన ఏపీ ప్రధాన కార్యదర్శి వారికి ఆశ్రయం కల్పించి, స్వరాష్ట్రాలకు పంపే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో సొంతూళ్ల బాట పట్టారు వలస కూలీలు. రాత్రనక పగలనక కాలినడకనే వెళ్తున్నారు. ఇలా చెన్నై-కోలకతా జాతీయ రహదారపై వెళ్తోన్న వలస కూలీల పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తన మానవతను చాటుకున్నారు.
ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షా సమావేశం తర్వాత విజయవాడకు వెళ్తోన్న సీఎస్ నీలం సాహ్ని జాతీయ రహదారిపై గుంపులు గుంపులుగా నడిచి వెళుతున్న వలస కూలీలను చూశారు. వెంటనే కారు ఆపి వలసకూలీలతో మాట్లాడారు. వారి బాగోగులు అడిగి తెలుసుకుని చలించిపోయారు. కూలీలు చెన్నై నుంచి బీహార్ కు వెళుతున్నట్టు తెలపటంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో సంయుక్త కలెక్టర్లతో మాట్లాడారు. వలస కూలీలకు వసతి, భోజనం కల్పించి శ్రామిక్ రైళ్ళలో సొంతూళ్లకు చేర్చాలని ఆదేశించారు. తమ పట్ల మానవతను చూపిన సిఎస్ కు కృతజ్ఞతలు తెలిపారు వలసకూలీలు.