ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగోరోజు (గురువారం) ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిపై వివిధ సభ్యులు సభలో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సభలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో తొలుత వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడారు.. సామాజిక, ఆర్థిక అసమానతల వల్ల కొంతమంది వెనకబడ్డారని, సమాజంలోని ఈ అసమానతలు తగ్గాలంటే విద్య చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కాగా ఇప్పటికే విద్యారంగానికి సంబంధించిన చట్టాన్ని సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లును అసెంబ్లీ సహా మండలి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ చట్టానికి చేసిన సవరణలను ఆమోదించారు. ఈ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి.
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి చైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి నివేదించిన నేపథ్యంలో మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా పడ్డాయి. దాంతో కేవలం అసెంబ్లీ సమావేశాలు మాత్రమే ఈరోజు కొనసాగనున్నాయి.
కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ సోమవారం నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తదితర అంశాలపై చర్చించేందుకు మొదట మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ నాలుగోరోజు కూడా పొడిగించింది. సోమవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిమండలి రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే సంచలన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన అంశాలను శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో చర్చించి ఆమోదం తెలిపింది. అయితే మండలిలో ప్రతిపక్ష టీడీపీకి సభ్యుల బలం ఎక్కువగా ఉండటంతో బిల్లులు ఆమోదం పొందలేదు.