పొట్టకూటి కోసం దేశం కానీ దేశం వెళ్లి మోసపోయారు కొందరు ఆంధ్రప్రదేశ్ మహిళలు. రాష్ట్రం నుంచి కువైట్ వెళ్లిన దాదాపు 200 మంది మహిళలు అక్కడి యజమానులు పెట్టె చిత్రహింసలు భరించలేక తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నారు. అయితే భారత్కు వచ్చేందుకు వారి వద్ద పాస్ పోర్టులు లేవు. వారిని నమ్మించి అక్కడి యజమానులు వారి వద్దనుంచి పాస్ పోర్టులు తీసుకున్నారు. అయితే కువైట్ కు తీసుకెళ్లిన బ్రోకర్లు కూడా వారిని కాపాడకుండా చేతులెత్తేశారు.
దాంతో తమను కాపాడాలని.. ఇండియాకు రప్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరుతూ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని వాట్సాప్లో తమ బంధువులకు పంపారు. వారు ముందుగా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అది వైరల్ అయింది. కువైట్ లో కారెం వసుంధర అనే మహిళ వీడియో సందేశంలో తమని కాపాడాలని వేడుకుంది. అలాగే..
గుత్తుల శ్రీను అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా ఇండియా తిరిగి వెళ్లే దిక్కు లేకుండా పోయిందని లక్ష్మి అనే మరో మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. అంతేకాదు వెంకటగిరి, రేపల్లె ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా తమను కాపాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వీడియో ద్వారా వేడుకున్నారు. వీరిని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గుత్తుల శ్రీను బి.ఏటికోట గ్రామానికి చెందిన ప్రకాశ్రాజ్ అనే ఏజెంట్లు వీరిని మోసం చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సీఎం వైఎస్ జగన్ కార్యాలయం వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు ఆదేశాల జారీ చేసింది.. ఇటు బాధిత మహిళలను వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారు.
మరోవైపు కువైట్ లో చిక్కుకున్న మహిళల్ని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ కు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు 200 మంది అక్రమ రవాణా బాధితులు కువైట్ లో చిక్కుకున్నారు. వారికి దౌత్య సహాయం అవసరం. నేను హృదయపూర్వకంగా మంత్రి జై శంకర్ ను అభ్యర్థిస్తున్నాను.. బాధితుల పట్ల దయ చూపి వారిని స్వదేశానికి వచ్చేటట్టు చెయ్యాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.