మద్యం దుకాణాలు తెరవడంతో ఏపీలో మరిన్ని సమస్యలు.. మోదీ నిర్ణయాలు భేష్
పాలకులు అసమర్థులైతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు.
పాలకులు అసమర్థులైతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పార్టీ సభ్యులతో బుధవారం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థలను నిర్మిస్తే ఏడాదిలోనే వైసీపీ ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్, జులై నెలల్లో కరోనా కేసులు మరింత పెరుగుతాయనే అంచనాలు ఆందోళనలు కలిగిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు నాలుగు రెట్లు పెరగడంతో పేదలు ఆవేదన చెందుతున్నారని చంద్రబాబు అన్నారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల ఏపీలో సమస్యలు మరింత పెరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. మద్యం ధరలు పెంచి, నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ 20లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
దేశంలో లాక్ డౌన్ ప్రధాని మోదీ పటిష్ఠంగా అమలు చేశారని కితాబిచ్చారు. ఆర్థిక వ్యవస్థతో పాటు జీవన విధానంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ తలకిందులవడం, రైతుల ఆర్థిక స్థితి దెబ్బతినడం, పరిశ్రమలు కుదేలవడం, ఉపాధి కోల్పోవడం వంటి సమస్యలు చుట్టుముట్టాయన్నారు. అయితే నిబంధనల అమల్లోనే కొన్ని రాష్ట్రాల్లో పొరపాట్లు జరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.