ప్రజల భద్రతే ముఖ్యం.. ఎల్జీ పాలిమర్స్ పై వెనక్కు తగ్గేది లేదు..ఏపీ మంత్రుల ప్రకటన
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ మెతకవైఖరి అవలంభించబోదని మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ మెతకవైఖరి అవలంభించబోదని మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.ఏపీ ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని, ఎల్జీ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యం కాదని తెలిపారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద స్థానికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రులు శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా పర్యటించిన మంత్రుల బృందం మాట్లాడారు.. ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి మృతదేహాలను త్వరగా తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రులు తెలిపారు. సున్నితమైన సమయంలో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దని టీడీపీకి మంత్రులు హితవుపలికారు. గ్యాస్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం వైఎస్ జగన్ సైతం చెప్పారని మంత్రులు గుర్తు చేశారు