ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డిగ్రీ, పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ, బీటెక్, వృత్తి విద్య,ఇతర కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని యూనివర్సిటీల ఉపకులపతుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే డిగ్రీ మొదటి, రెండు, బీటెక్ 3 ఏళ్లు, పీజీ మొదటి ఏడాది విద్యార్థులకు ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయనున్నారు.
అయితే కోవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించేల నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ నాయక్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షలను రద్దు తర్వాత మిడ్ వంటి పరీక్షలునిర్వహించడం ఆధారంగా చివరి సెమిస్టర్ విద్యార్థులకు మార్కులు కేటాయించాలని నిర్ణయించారు.
ఇప్పటికే కొన్ని యూనివర్సిటీల పరిధిలో కొన్ని సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాయి. మిగతా సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించకుండా అంతర్గత మూల్యాంకనం ద్వారా విద్యార్థులకు క్రెడిట్లు కేటాయిస్తారు. చివరి సెమిస్టర్ రాసే విద్యార్థులకు గత ఏడాది ఫెయిల్ అయిన సబ్జెక్టులు ఉంటే వాటికి అంతర్గత మార్కులు, మౌఖిక పరీక్షల ఆధారంగా విద్యార్ధులు క్రెడిట్లు కేటాయిస్తారు. ఇక నూతన అకడమిక్ సంవత్సరం ఆగస్టులో ఆరంభం కానుంది. ఆన్లైన్ లో క్లాసులు నిర్వహిస్తారు.