Electric Bus Factory in Anantapur: అనంతలో మరో పరిశ్రమ.. ఎలక్ట్రిక్ బస్సుల కర్మాగారం

Electric Bus Factory in Anantapur: ఇప్పటికే కియో కార్లతో తయారీ పరిశ్రమతో ముందడుగు వేస్తున్న అనంతపురం జిల్లాలో తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల కర్మాగారం ఏర్పాటయ్యేందుకు మార్గంసుగమం అయ్యింది.

Update: 2020-08-05 02:15 GMT
Electric Bus Factory in Anantapur

Electric Bus Factory in Anantapur: ఇప్పటికే కియో కార్లతో తయారీ పరిశ్రమతో ముందడుగు వేస్తున్న అనంతపురం జిల్లాలో తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల కర్మాగారం ఏర్పాటయ్యేందుకు మార్గంసుగమం అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో వీర వాహన కంపెనీ ఒప్పందం చేసుకుంది. దీనివల్ల స్థానికంగా ఉన్న నిరుద్యో్గ యువతకు జీవనోపాధి లభించడమే కాకుండా వ్యాపార పరంగా అనంతపురం జిల్లా మరింత ప్రగతి సాధిస్తుంది.

'కియా' కార్ల యూనిట్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న 'అనంత'లో మరో భారీ వాహనాల కంపెనీ ఏర్పాటు కాబోతోంది. కరువు జిల్లా ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతీసుకోవడంతో పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమను జిల్లాలో నెలకొల్పుతున్నారు. కియా మోటార్స్‌‌ తరహాలోనే జిల్లాలో ఎలక్ట్రిక్‌ బస్సుల యూనిట్‌ నెలకొల్పేందుకు వీర వాహన కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని సైతం చేసుకుంది.

రూ.1000 కోట్ల పెట్టుబడి

వీర వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.1000 కోట్లతో జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఒప్పందాలు కూడా పూర్తి కాగా... జిల్లా అధికారులు సోమందేపల్లి మండల సమీపంలోని గుడిపల్లి గ్రామంలో 124 ఎకరాల భూమిని కేటాయించారు. ఏటా 3 వేల బస్సుల తయారీ లక్ష్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్న వీర వాహన్‌ కంపెనీ ప్రతినిధులు తమకు కేటాయించిన భూమిలో పనులను సైతం ప్రారంభించారు. వచ్చే రెండేళ్లలోపు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాకుండా అనుబంధ కంపెనీలు సైతం ఇక్కడే నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో భూములను కేటాయింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

13 వేల మందికి ఉపాధి

వీర వాహన్‌ ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి... మొత్తంగా 13 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. మొన్న 'కియా'...తాజాగా 'వీర వాహన' ఇలా అంతర్జాతీయంగా పేరుగాంచిన వాహనాల తయారీ సంస్థలు జిల్లాకు రావడంతో పారిశ్రామికంగా జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీర వాహన కంపెనీకి సోమందేపల్లి మండల సమీపంలో 124 ఎకరాల భూమిని కేటాయించామని ఏపీఐఐసీ జోనల్ మేనేజరు పద్మావతి పేర్కొన్నారు. ఇప్పటికే సేల్‌ అగ్రిమెంట్‌ను సైతం పూర్తి చేశామని, కంపెనీ ప్రతినిధులు ప్రస్తుతం యూనిట్‌ను నెలకొల్పే పనులకు శ్రీకారం చుట్టారన్నారు. మరో రెండేళ్లలోపే యూనిట్‌లో బస్సుల తయారీ ప్రారంభమవుతుందని ఆమె స్పష్టం చేశారు. 

Tags:    

Similar News