లక్ష పడకలు సిద్ధం చేయాలి.. సీఎం జగన్ ఆదేశాలు
రాష్ట్రంలో కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలు తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలు తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బస్సుల్లోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలన్నారు. బస్సుల్లో నిత్యావసరాలు కూడా అందులో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే ఓ వైద్యుడు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, మందులు సైతం మొబైల్ యూనిట్లో అందుబాటులో ఉండాలన్నారు. లాక్డౌన్ పొడిగింపు, కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలపై శనివారం ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘాపెట్టి కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు గుర్తించామని, కంటైన్మెంట్ జోన్లలో అనుసరించాల్సిన వ్యూహాలు, అనుమతులున్న దుకాణదారుల వద్ద పాటించాల్సిన విధివిధానాలను రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ విభాగాలు గ్రామాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మే నెలఖరు లోగా రైతు భరోసా కేంద్రాలు ప్రారభించాలన్నారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.