ఐటీ రైడ్స్పై ఏపీలో హైఓల్టేజ్ పొలిటికల్ వార్ జరుగుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం కత్తులు దూసుకుంటున్నాయి. చంద్రబాబు టార్గెట్గా మంత్రులు ఘాటు కామెంట్స్ చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రివర్స్ కౌంటరిస్తోంది టీడీపీ.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ రైడ్స్పై తెలుగుదేశం, వైసీపీ మధ్య మధ్య హైఓల్టేజ్ వార్ జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును అధికార పార్టీ టార్గెట్ చేస్తోంది. మాజీ పీఎస్ ఇంట్లోనే 2వేల కోట్లు అక్రమాస్తులు దొరికితే ఇక, చంద్రబాబును పట్టుకుంటే ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయోనంటూ మాటల తూటాలు వదులుతున్నారు. ఇప్పుడు లాగింది తీగ మాత్రమే-డొంక చాలా పెద్దది ఆంధ్రా అవినీతి అనకొండ చంద్రబాబు అంటూ ఘాటైన పంచ్ డైలాగులు పేల్చుతున్న మంత్రులు, వైసీపీ నేతలు... తన మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. నిప్పునని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, వైసీపీ కామెంట్స్కు తెలుగుదేశం నేతలు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. అసలు, ఐటీ దాడులతో టీడీపీకి సంబంధమేంటంటూ యనమల ప్రశ్నించారు. అవినీతితో కూరుకుపోయిన జగన్ అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. చంద్రబాబులో అవినీతిని వెతకడం కంటే గుడ్డుపై ఈకలు పీకడం ఈజీ అంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు నారా లోకేష్.
మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు అవినీతి బట్టబయలైందంటూ అధికార వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే దొంగే దొంగన్నట్లుగా జగన్ పార్టీ నేతల తీరు ఉందంటూ తెలుగుదేశం కౌంటరిస్తోంది. మరి, ఈ ఐటీ వార్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.