Visakhapatnam: సబ్సిడీతో సోలార్ పవర్.. ఇంటికే వెలుగు, జేబుకు ఆదాయం!

Visakhapatnam: విశాఖపట్నం 48వ వార్డు ఇందిరా నగర్‌లో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు.

Update: 2026-04-05 07:27 GMT

Visakhapatnam: సబ్సిడీతో సోలార్ పవర్.. ఇంటికే వెలుగు, జేబుకు ఆదాయం!

విశాఖపట్నం: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరా నగర్ - 1లో 48వ వార్డు మాజీ కార్పొరేటర్, మాజీ జీవీఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్, మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజనపై అవగాహన కల్పించారు. మురళి నగర్ ఎలక్ట్రికల్ ఏఈ సుగుణ, సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పైకప్పు పైనే సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని ఇంటికి సరిపడా విద్యుత్‌ను వాడుకోవచ్చని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని వివరించారు. అవసరానికి ఎక్కువైన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి, ఆదాయం కూడా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ వార్డులో చాలా వరకు విద్యుత్ సంబంధిత సమస్యలను గడిచిన ఐదేళ్లలో పరిష్కరించడం జరిగిందన్నారు.

సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణ హితమైన విద్యుత్‌ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుందన్నారు. సౌర విద్యుత్తు వల్ల ప్రకృతికి నష్టం వాటిళ్లదని, విద్యుత్తు బిల్లులు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ప్రతి ఇంటి రూఫ్‌ టాప్‌ మీద ప్రభుత్వ రాయితీ లభిస్తుందని, మిగతా సొమ్ము బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు రుణాలుగా సమకూరుస్తాయని వివరించారు. విద్యుత్తు వినియోగం అనేక రెట్లు పెరిగిందని, దానికి తగ్గట్టు ఉత్పత్తి కూడా పెరగాలనే ఆలోచనతో పిఎం సూర్య ఘర్‌ యోజన పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. పర్యావరణానికి హాని చేయని సౌర శక్తి వాడకాన్ని ప్రజలంతా అలవాటుగా చేసుకోవాలని వివరించారు.

Tags:    

Similar News