Srikalahasti: దేవస్థాన అభివృద్ధి పనులపై ఈవో, ధర్మకర్తల మండలి అధ్యక్షుల వెల్లడి
Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానంలో రూ.28 లక్షలతో రాహుకేతు పూజా మండపాలు, స్థానికులకు ఉచిత అంతరాలయ దర్శనం, ఆన్లైన్ సేవల విస్తరణపై వివరాలు వెల్లడించిన ఈవో వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు కొట్టే సాయికుమార్.
Srikalahasti: దేవస్థాన అభివృద్ధి పనులపై ఈవో, ధర్మకర్తల మండలి అధ్యక్షుల వెల్లడి
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో కార్యాలయంలోని మీటింగ్ హాల్లో దేవస్థానం ఈవో బీకే. వెంకటేశ్వర్లు, పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో బీకే. వెంకటేశ్వర్లు, పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయికుమార్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి దేవస్థానంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయ ప్రాంగణంలో చేపట్టిన సుందరీకరణ, ఆలయం వెలుపల భక్తులకు అనుకూలంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు.
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దేవస్థానంలో ఆన్లైన్ సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని పాతాళ గణపతి ఆలయం వద్ద సుమారు రూ.28 లక్షల వ్యయంతో రాహుకేతు నివారణ పూజా మండపాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రతి బుధవారం స్థానికంగా ఉన్న సుమారు 300 మంది భక్తులకు ఉచితంగా స్వామి, అమ్మవార్ల అంతరాలయ దర్శనం కల్పించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా స్వర్ణముఖి నది సుందరీకరణ, గోశాలలో గోవులు సేదతీరేందుకు చేపట్టిన ఏర్పాట్లు, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల సుందరీకరణ పనులపై వివరించారు.
అన్నదాన కార్యక్రమంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పలు మార్పులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఎస్కిట్ కళాశాలలోని నర్సింగ్ విద్యార్థులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు వెల్లడించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధి, సుందరీకరణ, సేవల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఈవో బీకే. వెంకటేశ్వర్లు, పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయికుమార్ తెలిపారు.