TS Inter Results 2026 : 10 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు.. నేడే ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు
TS Inter Results 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు ఈరోజే (ఆదివారం, ఏప్రిల్ 12) విడుదల కాబోతున్నాయి.
TS Inter Results 2026
TS Inter Results 2026 : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) ఈ ఏడాది నిర్వహించిన వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనుంది. హైదరాబాద్ నాంపల్లిలోని విద్యాభవన్లో ఉదయం 11 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు సాగిన ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి, బోర్డు ఫలితాలను సిద్ధం చేసింది.
పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలు
ఈ ఏడాది ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం నుంచి 4,89,126 మంది విద్యార్థులు ఉండగా, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జనరల్ కోర్సులతో పాటు వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను కూడా బోర్డు ఒకేసారి అందుబాటులోకి తీసుకురానుంది. గత ఏడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?
ఫలితాల విడుదల తర్వాత సర్వర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల కోసం బోర్డు పలు వెబ్సైట్లను సిద్ధం చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ను ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
tgbie.cgg.gov.in
results.cgg.gov.in
examresults.ts.nic.in
ఈ వెబ్సైట్లలో లాగిన్ అయి మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. హాల్ టికెట్ నంబర్ తో పాటు పుట్టిన తేదీ అవసరం కావచ్చని, విద్యార్థులు తమ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
తదుపరి ప్రక్రియ - సప్లిమెంటరీ
ఫలితాల ప్రకటన అనంతరం రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోతే, వారు నిరాశ చెందకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాల విడుదల సందర్భంగా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా ఐటీ విభాగం పర్యవేక్షిస్తోంది. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఫలితాలను స్వీకరించాలని విద్యాశాఖ అధికారులు కోరారు.