CP Sai Chaitanya: నిజామాబాద్లో నేటి నుండి ఆంక్షలు.. డీజేలు వాడితే అంతే!
CP Sai Chaitanya: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల సౌకర్యార్థం నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు ప్రత్యేక పోలీస్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ (CP) సాయి చైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
CP Sai Chaitanya: నిజామాబాద్లో నేటి నుండి ఆంక్షలు.. డీజేలు వాడితే అంతే!
నిజామాబాద్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల సౌకర్యార్థం నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు ప్రత్యేక పోలీస్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ (CP) సాయి చైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు కఠినంగా అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
డీజేలు, శబ్ద కాలుష్యంపై ఉక్కుపాదం:
ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య బాధితులు మరియు చిన్నారులకు ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు నిర్వహించరాదని సీపీ సూచించారు.
రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.
అనుమతించిన సమయంలోనూ శబ్దం 55 డెసిబుల్స్ మించకూడదు.
నిబంధనలు ఉల్లంఘించే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సభలు, ఊరేగింపులకు అనుమతులు తప్పనిసరి:
బహిరంగ ప్రదేశాల్లో సభలు లేదా ఊరేగింపులు నిర్వహించాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలి.
500 మంది లోపు జనం ఉండే కార్యక్రమాలకు సంబంధిత ఏసీపీల అనుమతి ఉండాలి.
500 మందికి మించి జనాలు పాల్గొనే సభల కోసం 72 గంటల ముందే కమిషనర్ను కలిసి అనుమతి పొందాలి.
డ్రోన్ల వినియోగానికి కూడా సంబంధిత శాఖల క్లియరెన్స్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
గల్ఫ్ ఏజెంట్ల మోసాలపై అప్రమత్తత:
జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. పాస్పోర్ట్, వీసాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. వీటితో పాటు బహిరంగ మద్యం సేవించడం, మహిళలను వేధించడం వంటి పనులకు పాల్పడితే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. థియేటర్లలో 'ఏ' సర్టిఫికెట్ సినిమాలకు మైనర్లను అనుమతించకూడదని యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలు నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని ప్రజలు సహకరించాలని కోరారు.