Rohit Sharma: లండన్ చేరుకున్న రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. లార్డ్స్‌లోనే ఆఖరి మ్యాచ్!

Rohit Sharma: భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా?

Update: 2026-07-18 03:55 GMT

Rohit Sharma: లండన్ చేరుకున్న రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. లార్డ్స్‌లోనే ఆఖరి మ్యాచ్!

Rohit Sharma: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, అభిమానుల గుండెల్లో హిట్ మ్యాన్గా ముద్ర వేసుకున్న రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, క్రీడా వర్గాల్లో నడుస్తున్న రిటైర్మెంట్ ప్రచారాలు నిజం కాబోతున్నాయా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

జూలై 19న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్.. రోహిత్ శర్మ కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే వార్తలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. అందుకు ప్రధాన కారణం.. రోహిత్ తల్లిదండ్రులైన గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ హుటాహుటిన లండన్ చేరుకోవడమే. తమ కొడుకు దేశం తరఫున ఆడే ఆఖరి చారిత్రాత్మక మ్యాచ్‌కు మైదానంలో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచేందుకే వారు లండన్ వెళ్లారని మీడియా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

బీసీసీఐ లేదా రోహిత్ శర్మ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ భావోద్వేగపూరిత క్షణంలో కుటుంబ సభ్యులు లండన్ వేదికగా వాలడం హిట్ మ్యాన్ వీడ్కోలు మ్యాచ్‌పై దాదాపు స్పష్టతనిచ్చినట్లయింది. ఈ రిటైర్మెంట్ వెనుక టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గత వారమే రోహిత్ శర్మను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. అందువల్ల ఆ టోర్నీ రేసులో రోహిత్ శర్మ ఉండరని బోర్డు తేల్చి చెప్పినట్లు సమాచారం.

రోహిత్ స్థానంలో భవిష్యత్తు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని బోర్డు యోచిస్తోంది. నిజానికి అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌తోనే రోహిత్ కెరీర్‌ ముగించాలని సెలక్టర్లు భావించినా, అక్కడ రోహిత్ హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణయం వాయిదా పడింది. అయితే ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 11 రన్స్, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 26 రన్స్‌తో రోహిత్ విఫలమవ్వడం కూడా ఈ కఠిన నిర్ణయానికి కారణమైనట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోని రెండు ప్రధాన ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశారు. 2024 జూన్ 29న బార్బడోస్‌లో టీమిండియాకు ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన వెంటనే రోహిత్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత 2025 మే నెలలో ఒక భావోద్వేగపూరితమైన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా టెస్ట్ ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పారు.

ఇప్పుడు క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ వేదికగా జరగనున్న వన్డే మ్యాచ్‌తో తన 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికేందుకు హిట్ మ్యాన్ సిద్ధమయ్యాడు. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ బ్యాట్ ఝుళిపించి, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News