Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్‌..లార్డ్స్ మైదానంలో చివరి వన్డే.. బీసీసీఐ క్లారిటీ!

Rohit Sharma: టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై వస్తున్న ప్రచారంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

Update: 2026-07-18 03:29 GMT

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్‌..లార్డ్స్ మైదానంలో చివరి వన్డే.. బీసీసీఐ క్లారిటీ!

Rohit Sharma: టీమిండియా సీనియర్ ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం (జులై 19) లార్డ్స్ మైదానంలో రోహిత్ తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నడని న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్ పర్యటన మధ్యలో మొదలైన ఈ ప్రచారం ఒక్క రోజులోనే ఊపందుకుంది. ఫాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ ప్రచారానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చెక్ పెట్టింది.

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్ శర్మ కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుందని వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని, ప్రస్తుతం హిట్‌మ్యాన్‌ భారత వన్డే జట్టులో కీలక సభ్యుడేనని స్పష్టం చేశారు. దేవజిత్ సైకియా పీటీఐతో మాట్లాడుతూ.. 'రోహిత్ శర్మ భవిష్యత్తుపై సోషల్ మీడియా, మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. లార్డ్స్ వన్డే హిట్‌మ్యాన్‌ చివరి మ్యాచ్ అని న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందులో ఎలాంటి నిజం లేదు.మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం రోహిత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి లార్డ్స్ మ్యాచ్ అతడి చివరి వన్డే కాదు' అని తెలిపారు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేయడంతో.. హిట్‌మ్యాన్‌ ఫామ్‌పై చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలన్న తన కోరికను రోహిత్ ఇప్పటికే వ్యక్తం చేసినప్పటికీ.. ఇటీవలి ప్రదర్శనల నేపథ్యంలో అతడి భవిష్యత్తుపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా రెండో వన్డే అనంతరం స్పందించారు. రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాడిపై ఎలాంటి ఒత్తిడి లేదని, రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోయినా అతడి సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తోనే మ్యాచ్ గమనాన్ని మార్చగల సత్తా రోహిత్‌కు ఉందని కోటక్ ధీమా వ్యక్తం చేశారు.

2024 టీ20 ప్రపంచ కప్‌ విజయం అనంతరం యువకులకు అవకాశాలు ఇవ్వాలని రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. గతేడాది టెస్టుల నుంచి కూడా హిట్‌మ్యాన్‌ తప్పుకొన్నాడు. కానీ వన్డేల్లో మాత్రం 2027 ప్రపంచ కప్‌ వరకు కొనసాగాలనుకున్నాడు. అంతేకాదు జట్టును కూడా తనే నడిపించాలన్నాడు. కానీ 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపిన అతడిని సారథిగా తప్పించి బీసీసీఐ పెద్ద షాక్ ఇచ్చింది.

హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఒత్తిడి కారణంగానే హిట్‌మ్యాన్‌ తప్పుకున్నాడని వార్తలొచ్చాయి. అయినా రోహిత్‌ ఏమీ మాట్లాడకుండా.. ఆటగాడిగా టీమిండియాలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఏకంగా వీడ్కోలు అంటూ న్యూస్ వచ్చింది. బీసీసీఐ తాజా ప్రకటనతో రోహిత్ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినట్లైంది. మరోవైపు ఫామ్, ఫిట్‌నెస్ కారణంగా విరాట్ కోహ్లీ 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నాడు.

Tags:    

Similar News