IPL Playoffs Race: ఆర్సీబీ గెలుపుతో మారిన లెక్క‌లు.. ర‌స‌వ‌త్త‌రంగా ప్లే ఆఫ్స్ పోరు

IPL Playoffs Race: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ ప్లేఆఫ్స్ పోరు మరింత రసవత్తరంగా మారుతోంది.

Update: 2026-05-14 06:52 GMT

IPL Playoffs Race: ఆర్సీబీ గెలుపుతో మారిన లెక్క‌లు.. ర‌స‌వ‌త్త‌రంగా ప్లే ఆఫ్స్ పోరు 

IPL Playoffs Race: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ ప్లేఆఫ్స్ పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ప్రతి మ్యాచ్ పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేస్తోంది. తాజాగా బుధ‌వారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు కొన్ని జట్ల ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు ముగిసిపోయాయి.

కేకేఆర్‌పై ఘన విజయం.. టేబుల్ టాప్‌లో ఆర్సీబీ

ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో అద్భుత ఆటతీరును కనబరిచింది. ముఖ్యంగా క‌ష్ట స‌మ‌యంలో కోహ్లీ అద్భుత సెంచ‌రీతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో బెంగళూరు జట్టు 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ముఖ్యంగా జట్టు మొత్తం కలిసి ఆడుతున్న తీరు చూస్తుంటే ఈసారి టైటిల్ కోసం ఆర్సీబీ గట్టి పోటీ ఇవ్వనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

ప్లేఆఫ్స్‌కు దగ్గరైన రెండు జట్లు

ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఆర్సీబీతో పాటు గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ప్లేఆఫ్స్‌కు చాలా దగ్గరగా చేరుకుంది. అధికారికంగా ఇంకా అర్హత ఖరారు కాకపోయినా, పాయింట్లు, నెట్ రన్‌రేట్ పరంగా ఈ రెండు జట్లు టాప్-4లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ జట్టు ఈ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతోంది. దీంతో మిగిలిన రెండు స్థానాల కోసం మిగతా జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

సన్‌రైజర్స్‌కు మంచి ఛాన్స్.. నాలుగో స్థానం కోసం భారీ పోటీ

తెలుగు అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే ఉన్నాయి. హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని నమోదు చేస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ఖాయం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో ఆ జట్టు చూపిస్తున్న స్థిరత్వం వారికి పెద్ద బలంగా చెప్పొచ్చు. మరోవైపు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నాలుగో స్థానం కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ జట్లకు మిగిలిన ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కొద్దిగా ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఒక్క ఓటమి సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు బయటపడిన జట్లు

ఈ సీజన్‌లో కొన్ని జట్లకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయాయి. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నాలుగు జట్ల అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మొత్తానికి ఈసారి ఐపీఎల్‌లో చివరి వరకు ఉత్కంఠ కొనసాగనుంది. ప్రతి మ్యాచ్‌తో పాయింట్ల పట్టిక మారిపోతుండటంతో ఏ జట్టు ఫైనల్ చేరుతుందో ఇప్పుడే చెప్పడం కష్టంగా మారింది.

Tags:    

Similar News