Rajahmundry: ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి - మార్గాని భరత్ నివాళి

Rajahmundry: రాజమండ్రిలో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు జరిగాయి. మహానేత సేవలను మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ కొనియాడారు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Update: 2026-09-02 12:52 GMT

Rajahmundry: ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి - మార్గాని భరత్ నివాళి

రాజమండ్రి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో స్వర్ణయుగం నడిచిందని, సంక్షేమ పథకాల ద్వారా అన్ని కుటుంబాలకు మేలు చేకూర్చిన ఘనత వైఎస్ఆర్‌కే దక్కుతుందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసిపి జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్గాని భరత్ రామ్ కొనియాడారు.

వైఎస్ఆర్ 17వ వర్థంతి సందర్భంగా స్థానిక విఎల్ పురం వైసిపి సిటీ కార్యాలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి భరత్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావు, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, ఎపి గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, వైసిపి వివిధ విభాగాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు.

వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మార్గాని భరత్ మాట్లాడుతూ తన సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆదుకున్న మహానీయుడు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబ ర్స్మెంట్ వంటి పథకాల ద్వారా వైయస్సార్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.

తండ్రి ఆశయాల కోసం ఆయన పేరుతోనే పార్టీ పెట్టి తండ్రికి మించిన తనయుడిగా సువర్ణపాలన అందించిన జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరు తోడుగా ఉండాలన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించిన జగన్మో హన్ రెడ్డి ద్వారానే ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇచ్చారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన వందల హామీలను తుంగలో తొక్కారన్నారు.

ఇచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయలేని ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేసారు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ఏడాదికి 48 వేల 500 ఇస్తామని మోసం చేసారని ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో చంద్రబాబుకి, టీడీపీ సైకిల్ గుర్తుకి ఎందుకు ఓటేయాలో ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటు తున్నాయని, సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదని ధ్వజమెత్తారు.

తండ్రి ఆశయాలు నేరవేర్చే సత్తా కలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసిపికి మద్ధతుగా నిలవాలని కోరారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తాను వైఎసఆర్ ఆధ్వర్యంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం రావడం గర్వకారణంగా ఉందన్నారు. పేదలకు ఎటువంటి సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లినా వెంటనే పని జరిగిపోయేదన్నారు. అటువంటి మహానాయకుడిని మళ్లీ మనం చూడలేమన్నారు. నేడు తండ్రి వైఎస్ఆర్ బాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.

పలు ప్రాంతాల్లో వైయస్సార్ విగ్రహాలకు ఘన నివాళులు

అనంతరం రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక కొబ్బరికాయల మార్కెట్ వద్ద వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

అక్కడ నుంచి స్థానిక మోరంపూడి జంక్షన్ లో యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అరె చిన్ని ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి, ఆ తర్వాత కోట గుమ్మం వద్దనున్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, వార్డు ఇంచార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Tags:    

Similar News