Exam Paper Leak : NEET వివాదం వేళ ఒడిశాలో మరో కలకలం.. ఎగ్జామ్ హాల్ నుంచే పేపర్ లీక్.?

Exam Paper Leak : దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్షల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో, ఒడిశాలోని మెడికల్ పీజీ పరీక్షకు సంబంధించి సరికొత్త వివాదం

Update: 2026-07-31 09:14 GMT

Exam Paper Leak

Exam Paper Leak : దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్షల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో, ఒడిశాలోని మెడికల్ పీజీ పరీక్షకు సంబంధించి సరికొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. ఒడిశా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ (OUHS) పరిధిలో నిర్వహించిన మెడికల్ పీజీ జనరల్ సర్జరీ (MD/MS) పరీక్ష జరుగుతుండగానే, ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో దర్శనమివ్వడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై అధికారులు తీవ్రస్థాయిలో దృష్టి సారించగా, తదుపరి పరీక్షల కోసం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

వాట్సాప్‌లో ప్రశ్నపత్రం, జవాబుల లీక్..

2023-26 బ్యాచ్‌కి చెందిన జనరల్ సర్జరీ MD/MS పరీక్ష జరుగుతున్న సమయంలో ఈ అక్రమం జరిగినట్లు సమాచారం అందుతోంది. పరీక్ష హాల్‌లో అభ్యర్థులు పేపర్ రాస్తుండగానే ప్రశ్నపత్రం ఫొటోలు కొందరు విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమయ్యాయి. కేవలం ప్రశ్నపత్రమే కాకుండా కొన్ని నిర్దిష్ట నంబర్ల నుండి సమాధానాలు కూడా సర్క్యులేట్ అయ్యాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ రకమైన ఘటనలతో మూల్యాంకన ప్రక్రియ పారదర్శకతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అత్యవసర భేటీ.. ఆంక్షలు కఠినం

ఈ అంశంపై ఫిర్యాదు అందగానే అకడమిక్ అధికారులు అత్యవసరంగా వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మిగిలిన రెండు పరీక్షలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. బెర్హంపూర్ లోని MKCG మెడికల్ కాలేజీ చైర్మన్ ప్రొఫెసర్ హరేకృష్ణ దలాయ్ మాట్లాడుతూ, వైస్ ఛాన్సలర్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఏ ఒక్క మినహాయింపు లేకుండా కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే సెంటర్లలోకి మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను పూర్తిగా నిషేధించారు.

ఇది పేపర్ లీక్ కాదు.. హాల్ నుంచి పంపిన లీకేజ్

అయితే ఈ ఘటనను సాంప్రదాయకమైన ప్రశ్నపత్రం లీక్‌గా భావించలేమని ప్రొఫెసర్ దలాయ్ అభిప్రాయపడ్డారు. పరీక్ష ప్రారంభం కాకముందే క్వశ్చన్ పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ అంటారని, కానీ ఇక్కడ ఉదయం 9:58 గంటలకు అంటే పరీక్ష ప్రారంభమై అభ్యర్థులకు పేపర్లు పంపిణీ చేసిన తర్వాత బయటకు పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన వివరించారు. పరీక్ష హాల్‌లోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా తనిఖీలు చేసినప్పటికీ, ఎవరైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని లేదా మొబైల్‌ను లోపలికి తీసుకెళ్లి ఫొటో తీసి పంపి ఉంటారని అనుమానిస్తున్నారు.

దర్యాప్తు వేగవంతం.. డిజిటల్ ఆధారాలపై దృష్టి

ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఏ గ్రూపులో అయితే పేపర్ షేర్ అయ్యిందో, ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసిన వ్యక్తి, అడ్మిన్‌లు , గ్రూప్ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. జవాబులను పంపిన ఫోన్ నంబర్ల ఆధారంగా దీని వెనుక ఏమైనా వ్యవస్థీకృత గ్యాంగ్ ఉందా అనే కోణంలో పోలీసులు, అధికారులు డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి ఏ విద్యార్థి సంఘం లేదా ముఠా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని, విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి ముగింపునకు రాలేమని తెలిపారు. అయితే, ఈ ఉల్లంఘనకు పాల్పడిన విద్యార్థులు లేదా సిబ్బందిపై కఠిన చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News