Brij Bhushan : బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. రెజ్లర్ల కేసులో కోర్టు సంచలన తీర్పు.!

Brij Bhushan : భారత కుస్తీ సమైక్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఆయనపై నమోదైన లైంగిక

Update: 2026-08-10 05:26 GMT

brij-bhushan

Brij Bhushan : భారత కుస్తీ సమైక్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేస్తూ, కేసు నుంచి నిర్దోషిగా విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు అడిషనల్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ తీర్పునిచ్చారు. ఈ ఆరోపణలు ‘అబద్ధపు, కల్పితమైనవి’ మాత్రమే కాక, రాజకీయోద్దేశంతో కూడుకున్నవని కోర్టు అభిప్రాయపడింది. బ్రిజ్ భూషణ్‌తో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌ను కూడా కోర్టు ఈ కేసు నుంచి విముక్తులను చేసింది.

ఆరోపణల్లో బలం లేదు.. ప్రాసెక్యూషన్ వైఫల్యం

కేసును సమగ్రంగా విచారించిన న్యాయస్థానం.. మోపబడిన ఆరోపణలను సంశయాస్పదంగా, నిరూపించలేనివిగా పేర్కొంది. సదరు ఆరోపణలు చేసిన రెజ్లర్లు సంఘటనల తర్వాత కూడా బ్రిజ్ భూషణ్‌తో సాధారణంగానే మాట్లాడటం, ఆయన కుటుంబ వేడుకలకు, వివాహాలకు హాజరవ్వడం వంటి అంశాలను కోర్టు గుర్తుచేసింది. బాధితులుగా పేర్కొంటున్నవారు ఏ సమయంలోనూ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లకపోవడాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆరోపణలన్నీ ఒకే రకంగా, ఒకే కాలంలో రావడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడింది. సంశయాలకు అతీతంగా ఆరోపణలను నిరూపించడంలో ప్రాసెక్యూషన్ "పూర్తిగా విఫలమైంది" అని కోర్టు స్పష్టం చేసింది.

మాట మార్చిన కీలక సాక్షులు

ఈ కేసులో మరో ముఖ్యాంశం ఏమిటంటే.. ప్రాసెక్యూషన్ దాఖలు చేసిన కేసులోని ఇద్దరు ప్రధాన మహిళా రెజ్లర్లు విచారణ సమయంలో తమ వాంగ్మూలాన్ని మార్చుకుని సాక్ష్యానికి దూరంగా ఉన్నారు. తాము ఒత్తిడి వల్లే మొదట్లో ఆ ప్రకటనలు ఇచ్చామని వారు కోర్టుకు తెలిపారు. ఇది ప్రాసెక్యూషన్ వాదనను మరింత బలహీనపరిచింది. దీనికి ముందే, ఒక మైనర్ రెజ్లర్ దాఖలు చేసిన ఫిర్యాదును కూడా ఉపసంహరించుకోవడంతో, ఆ పోక్సో (POCSO) కేసును ఇదివరకే మూసివేసిన సంగతి తెలిసిందే.

సుదీర్ఘ పోరాటం.. తదుపరి అడుగుపై ఉత్కంఠ

2023లో ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి దిగ్గజ అథ్లెట్లు 36 రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2024 మే నెలలో కోర్టు అభియోగాలు నమోదు చేసింది. తీర్పు అనంతరం బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ.. మెడల్స్ వేసే సమయంలో జరిగిన స్పర్శను తప్పుగా చిత్రీకరించి తనపై రాజకీయ కుట్ర చేశారని ఆరోపించారు. కాగా, ఈ దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పైకోర్టులో అప్పీల్ చేయాలని రెజ్లర్లు నిర్ణయించుకున్నట్లు వినేష్ ఫోగట్ వెల్లడించారు.

Tags:    

Similar News