RO Water: ప్యూరిఫైర్ నీరు తాగితే ఆరోగ్యానికి ప్రమాదామా.? ఇందులో నిజమెంత
RO Water: ప్రస్తుతం చాలా ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించడం సాధారణమైంది. ముఖ్యంగా రివర్స్ ఆస్మోసిస్ (RO) టెక్నాలజీతో పనిచేసే ప్యూరిఫైయర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది భావిస్తుంటారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
RO Water: ప్యూరిఫైర్ నీరు తాగితే ఆరోగ్యానికి ప్రమాదామా.? ఇందులో నిజమెంత
RO ప్యూరిఫికేషన్లో నీటిని ఒక ప్రత్యేకమైన మెంబ్రేన్ ద్వారా పంపిస్తారు. ఈ ప్రక్రియలో నీటిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు, ఉప్పులు, భారమైన లోహాలు వంటి హానికర పదార్థాలు వేరుపడతాయి. ఫలితంగా నీరు మరింత శుభ్రంగా మారుతుంది. ప్రత్యేకంగా నీటిలో ఎక్కువ మలినాలు ఉన్న ప్రాంతాల్లో RO ప్యూరిఫైయర్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ ప్రక్రియలో నీటిలో సహజంగా ఉండే కొన్ని ఖనిజాలు, ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం వంటివి కొంతమేర తగ్గిపోవచ్చు.
RO నీటిలో మినరల్స్ తగ్గిపోతాయా?
RO ద్వారా నీరు శుద్ధి చేసినప్పుడు కొన్ని సహజ ఖనిజాల పరిమాణం తగ్గే అవకాశం ఉంది. అందుకే కొందరు RO నీరు చాలా ఎక్కువగా శుద్ధి చేయడం వల్ల మినరల్స్ తగ్గిపోతాయని అనుకుంటారు. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ భయం ఎక్కువగా అపోహల వల్లే వస్తుంది. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన ఖనిజాల ప్రధాన వనరు నీరు కాదు.
మినరల్స్ ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తాయి?
పోషకాహార నిపుణుల ప్రకారం మన శరీరానికి అవసరమైన ఎక్కువ మినరల్స్ ఆహారం ద్వారానే అందుతాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, ప్రోటీన్ పదార్థాలు వంటి ఆహారాల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి.
నీటి ద్వారా లభించే ఖనిజాల పరిమాణం చాలా తక్కువ. కాబట్టి సంతులిత ఆహారం తీసుకుంటున్న వ్యక్తులకు RO నీరు తాగడం వల్ల మినరల్స్ లోపం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
RO నీరు కిడ్నీలపై ప్రభావం చూపుతుందా?
కిడ్నీ నిపుణుల ప్రకారం RO నీరు తాగడం వల్ల సాధారణంగా కిడ్నీలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. RO సిస్టమ్ నీటిలోని మలినాలను తొలగించి తాగడానికి సురక్షితంగా మార్చుతుంది. అదే సమయంలో శరీరానికి కావాల్సింది శుభ్రమైన నీటిని సరిపడా తాగడం, సంతులిత ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. శుభ్రమైన నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది.
RO నీరు తాగితే ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందా?
కొంతమంది దీర్ఘకాలం RO నీరు తాగితే శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని అనుకుంటారు. అయితే డాక్టర్ల ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రధానంగా కిడ్నీలు, హార్మోన్లతో పాటు మనం తీసుకునే ఆహారం నియంత్రిస్తాయి. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఆహారం ద్వారానే లభిస్తాయి. అందువల్ల సాధారణ పరిస్థితుల్లో RO నీరు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యతపై పెద్దగా ప్రభావం ఉండదని వైద్యులు చెబుతున్నారు.