Mydukur: రైతులు విధిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి - ఏడీఏ కృష్ణమూర్తి
Mydukur: మైదుకూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఫలాలు అందాలంటే రైతులు ఈ-క్రాప్ నమోదు, ఫార్మర్ ఐడీ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.
Mydukur: రైతులు విధిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి - ఏడీఏ కృష్ణమూర్తి
మైదుకూరు: రైతులు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన ప్రతి పంటనూ తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని మైదుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మండల పరిధిలోని మీర్జ్ఖాన్పల్లె గ్రామంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరతో పంట ఉత్పత్తుల విక్రయాలు జరగాలంటే పంట నమోదు తప్పనిసరి అని పేర్కొన్నారు. ప్రతి రైతు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) కలిగి ఉండాలని, యాప్ ద్వారా యూరియా, డీఏపీ వంటి ఎరువులు పొందడానికి ఈ ఐడీ తప్పనిసరిగా ఉండాలని వివరించారు.
అనంతరం మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సెప్టెంబర్ నెలలోనూ లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తక్కువ నీటితో పండే మినుము, జొన్న, పెసర, కంది వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు మిరియం, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.