Vijayawada: విజయవాడ, తిరుపతి ఇక 'గ్రేటర్'!
Vijayawada: విజయవాడ, తిరుపతి నగరాలను త్వరలోనే 'గ్రేటర్' నగరాలుగా మారుస్తామని మంత్రి నారాయణ వెల్లడి. విజయవాడ శివార్లలో రూ. 105 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన.
Vijayawada: విజయవాడ, తిరుపతి ఇక 'గ్రేటర్'!
Vijayawada: విజయవాడ శివార్లలో 105 కోట్లతో మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ.. నగరాల అభివృద్ధికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందని, తాడిగడపలో అభివృద్ధి పనుల జోరు మొదలైందని చెప్పారు.. విజయవాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో మంత్రి నారాయణ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 105 కోట్లతో మూడు మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేయడంతో పాటు, తాడిగడప సనత్ నగర్లో 2.75 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..
విజయవాడ, తిరుపతి నగరాలను త్వరలోనే గ్రేటర్ నగరాలుగా మారుస్తామని, జనగణన పూర్తి కాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణమే 7 కోట్లు విడుదల చేయాలని ఆదేశించిన ఆయన, గత ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించడం వల్లే రాష్ట్రంలో మౌలిక వసతుల పనులు నిలిచిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి 29 వేల కోట్లు అవసరమని, ప్రస్తుతం ప్రజలకు తాగునీరు, డ్రెయిన్ల కల్పనపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.