Amaravati Construction: అమరావతి గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.
Amaravati Construction: అమరావతి గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో, 20 వేల మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్న రాజధాని ప్రాజెక్టుల ప్రగతి విశ్లేషించారు.
శనివారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రూ.57,821 కోట్ల విలువైన వివిధ దశల పనుల పురోగతి, హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం పరిశీలించారు.
సవాళ్లు, వ్యయ నియంత్రణ, పనుల పూర్తి
గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించే సమయంలో ఎదురైన సవాళ్లు, పెరిగిన నిర్మాణ వ్యయాలను అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించిన విధానం అధికారులు సీఎం కి వివరించారు. ప్రస్తుతానికి రాజధానిలో 20 వేల మంది కార్మికులు, నిపుణులు కృషి చేస్తున్నారని చెప్పారు.
చరిత్రలో భాగస్వామ్యం
చంద్రబాబు మాట్లాడుతూ, “రాజధాని నిర్మాణం కేవలం కాంట్రాక్ట్ వర్క్ కాదు. ఈ బృహత్కార్యంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరు చరిత్రలో భాగస్వాములు. ఎన్నో ప్రాజెక్టులు చేయవచ్చు, కానీ ఒక రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు” అని స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి ‘ఫ్యూచర్ సిటీ’గా తీర్చిదిద్దడం ప్రతి నిర్మాణ సంస్థ బాధ్యత అని చెప్పారు.
లక్ష్యాల సాధన, పథక ప్రణాళికలు
ప్రతి నిర్మాణ సంస్థ వార్షిక, నెలవారీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అవసరమైన కార్మికులు, యంత్ర సామగ్రి లెక్కింపులు చేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పూర్తి చేయాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాణ్యత, వ్యయ నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికత ఉపయోగం తప్పనిసరి అని తెలిపారు. అవసరమైతే మానవ వనరులు పెంచి ప్రతి నిర్మాణం సమయానికి పూర్తి కావాలని ఆదేశించారు.