Amaravati: రాజధాని పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నారాయణ!
Amaravati: అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. లండన్ పర్యటన నుంచి వచ్చిన మంత్రి నారాయణ ఏర్పాట్లను పరిశీలించారు.
Amaravati: రాజధాని పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నారాయణ!
Amaravati: రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. లండన్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు స్టీల్ బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానించడంతో పాటు రాజధాని ప్రాంతంలో రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేలా ఈ రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పనులు పూర్తికావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.
రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కీలక ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డును సీఎం ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాజధానిలో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను ప్రజాప్రతినిధులకు అప్పగించనున్నారు. దీంతో అమరావతి రాజధాని కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోనున్నాయి.
సీఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. ప్రారంభోత్సవ వేదికలు, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజాప్రతినిధుల రాకపోకలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
అమరావతి అభివృద్ధి పనుల్లో ఒక్కో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని నిర్మాణానికి కొత్త ఊపు వస్తోంది. ఇప్పటికే పరిపాలనా భవనాలు, రహదారులు, మౌలిక వసతుల పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం, ఎమ్మెల్యేలు–ఎమ్మెల్సీలకు క్వార్టర్ల అప్పగింతతో అమరావతి అభివృద్ధిలో మరో ముఖ్యమైన అడుగు పడనుంది.
వచ్చే రోజుల్లో మరిన్ని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాజధాని నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో వేగం పుంజుకోవడంతో అమరావతి రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి.