అనకాపల్లికి రెడ్ అలెర్ట్.. అప్రమత్తంగా ఉండాలి విపత్తుల నిర్వహణ శాఖా
Amaravati: అనకాపల్లి జిల్లాలో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున రెడ్ అలెర్ట్ జారీ చేసిన విపత్తుల సంస్థ.
అనకాపల్లికి రెడ్ అలెర్ట్.. అప్రమత్తంగా ఉండాలి విపత్తుల నిర్వహణ శాఖా
అమరావతి: అనకాపల్లి జిల్లాకు వాతావరణ ముప్పు పొంచి ఉంది. రాబోయే మూడు గంటల్లో జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ముఖ్యంగా నర్సీపట్నం, ఎలమంచిలి, తాళ్లపాలెం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఆకాశంలో ఉరుములు, మెరుపులు కనిపించిన సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. రైతులు పొలాల్లో, వ్యవసాయ పనుల్లో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఒంటరిగా ఉన్న నిర్మాణాల కింద ఆశ్రయం పొందకూడదని సూచించారు. అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, వర్షం తగ్గే వరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు.
మరోవైపు, బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ తీగలు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాహనదారులు కూడా అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
పిడుగుల ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.