కన్నకొడుకు నుంచి ప్రాణహాని ఉందంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించింది కన్నతల్లి. నవమాసాలు మోసి కని-పెంచి...పెద్దచేసి.. ప్రయోజకులను చేసిన తల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు కొడుకులు. అనాథలా వదిలేయడంతో భిక్షాటన చేస్తూ బతికిన బాధితురాలు జయమ్మ ప్రస్తుతం ఓల్డేజ్ హోమ్లో కాలం వెళ్లదీస్తోంది. 34 ఎకరాల భూమిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చినా తన జీవనభృతి కోసం ఉంచుకున్న ఆరు ఎకరాలను కూడా లాక్కుని ఇంటి నుంచి గెంటేశారంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం సనిపెల్లి గ్రామానికి చెందిన జయమ్మ, భిక్షా రెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు. భార్య , భర్తలు ఇద్దరు కలిసి పిల్లలను చదివించి , ప్రయోజకులను చేశారు. ఐదేళ్ల క్రితం భర్త భిక్షా రెడ్డి మరణించడంతో , వారు కష్టపడి సంపాదించుకున్న 40 ఎకరాల భూమిలో 6 ఎకరాలు జయమ్మ జీవన భృతి కోసం ఉంచుకొని , మిగిలిన భూమిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచింది. కానీ చివరకు ఆమె పరిస్థితే రోడ్డుపాలవుతుందని పాపం ఊహించలేకపోయింది. ఆస్తులు పంచగా తనకు మిగిలిన భూమిపై చిన్న కొడుకు ప్రభాకర్ రెడ్డి కన్ను పడింది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసేందుకు సంతకం కావాలంటూ మభ్యపెట్టి ఆ భూమిని అతని పేరు పై రాయించుకున్నాడు. అనంతరం తన ఇంట్లో ఉంటున్న ముసలి తల్లిపై దాడి చేసి , ఇంట్లో నుంచి గెంటి వేశాడు. మిగతా ఇద్దరు కుమారులు కూడా చేరదీసేందుకు ఒప్పుకోకపోవడంతో ఆ తల్లి రోడ్డుపాలైంది. దీంతో జయమ్మ అందరూ ఉన్న అనాథలా మారింది.
కొడుకులు గెంటివేయడంతో అనాధ మారిన జయమ్మ భిక్షాటన చేస్తూ, జీవనం వెళ్లదీసింది. మూడేళ్ళుగా తిండి లేక , రోడ్లపై జీవనం సాగిస్తూ దుర్భరమైన జీవితం గడిపింది. ఆరు నెలల క్రితం ఓ ఎన్జీవో హోమ్ నిర్వాహకులు చేరదీయడంతో ప్రస్తుతం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటుంది. తన కొడుకు తన భూమిని అక్రమంగా లాక్కొని, దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదంటూ జయమ్మ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. కొడుకు నుండి ప్రాణహాని ఉందని , అతని నుండి రక్షణ కల్పించి , న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే దుర్భాశలాడిన ఎసై రామాంజనేయులు పై చట్టపరమైన చర్యలు తీసుకొని నాయ్యం చేయాలని కమిషన్ ను వేడుకుంది.