భవానీపూర్‌తో హుజూరాబాద్‌కు లింకేంటి?

Huzurabad: బీజేపీకి ఓటు ముఖ్యమా... సీటు ముఖ్యమా? టీఆర్ఎస్‌కు కళ్లెం వేయాలా?

Update: 2021-07-29 10:33 GMT

భవానీపూర్‌తో హుజూరాబాద్‌కు లింకేంటి?

Huzurabad: బీజేపీకి ఓటు ముఖ్యమా... సీటు ముఖ్యమా? టీఆర్ఎస్‌కు కళ్లెం వేయాలా? లేక మమత‌కు చెక్ పెట్టాలా? ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రధాన శత్రువు ఎవరు? మమత కోసం బై పోల్ నోటిఫికేషన్ ఆపేస్తుందా? లేక తెలంగాణలో బలపడేందుకు ఈటల కోసం విడుదల చేస్తుందా? ఇప్పుడు బీజేపీ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? మమత కోసం ఈటలకిచ్చే ప్రయార్టీ ఛేంజ్‌ చేస్తారా? లేక కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు ఈటలకే ప్రయార్టీ ఇస్తారా? ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హుజురాబాద్ బై పోల్ నోటిఫికేషన్‌పై జరుగుతున్న హాట్ డిస్కషన్ ఏంటి?

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరున్నొక్క రాగాలు ఆలపిస్తుంటే కేంద్రంలోని బీజేపీ నేతల ప్రియారిటీస్ క్షణక్షణం మారుతున్నాయట. ఇప్పటి వరకు బీజేపీ నేతలకు బెంగాల్ సీఎం మమత చుక్కలు చూపించారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. అయినా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆరు నెలల్లో ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆమె సీఎంగా కొనసాగుతారు. లేకపోతే తన వీర విధేయుడికి సీఎం కుర్చీ త్యాగం చేయాల్సి వస్తుంది. అదే జరిగితే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీగా బీటలు పడటం ఖాయంగా భావిస్తున్నారు విశ్లేషకులు.

ఇప్పుడిదే విషయం మమతను కూడా ఆందోళనలో పడేసింది. అందుకే బెంగాల్లో ఇప్పటివరకు డిమాండ్ రూపంలో కూడా లేని విధానసభ అంశాన్ని ముందుకు తెచ్చారు. మండలికి కేంద్రం ఒప్పుకోకపోతే, బెంగాల్లో మమత సీటు కిందికి నీళ్లు రావడం ఖాయం. అదే జరిగితే తృణమూల్ కాంగ్రెస్ లో అలజడి రేగుతుంది. అసంతృప్తులు, నిరసనకారుల సంఖ్య పెరుగుతుంది. వారందరినీ కంట్రోల్ చేసే యుక్తిగానీ, సామర్థ్యం గానీ మమతకు ఉన్నంత, ఆమె విధేయులకు ఉండే అవకాశమే లేదు. ఇది జరగకుండా ఉండేందుకే ఆ రాష్ట్రంలో విధానసభ పెట్టాలని మమత హడావుడిగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

మమత పోటీ చేయాల్సి ఉన్న భవానీపూర్ ఇప్పటికే ఖాళీగా ఉంది. మమతను అటు నుంచి అటే ఇంటికి పంపించేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. కరోనా థర్డ్ వేవ్ సాకుతో కేంద్రం ఆధీనంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం భవానీపూర్ ఎన్నికను ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపించడం లేదన్న ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ ఆలోచన మేరకే బెంగాల్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఆలస్యం కావచ్చని, హుజూరాబాద్‌కు కూడా నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఇప్పట్లో లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అలా అనివార్య పరిస్థితుల్లో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఆలస్యమవుతున్న కొద్దీ అది ఈటల సానుభూతి పవనాలను బలహీనం చేస్తుందని, దీనివల్ల ఈటల సర్వశక్తులు ఒడ్డినా గెలుపు అంత సులభం కాదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. తమ మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే బీజేపీ నేతలకు ఈటల గెలుపు కన్నా మమతను ఇంటికి పంపించడమే ముఖ్యం. కాబట్టి హుజూరాబాద్ అంశాన్ని బీజేపీ నేతలు అటకెక్కించడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భవానీపూర్ ఎన్నిక ఆలస్యమైతే ఈటల రాజకీయ భవిష్యత్తును బీజేపీ నేతలే చేజేతులా పాడు చేసినట్లవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజీపీ అధినాయకత్వం, ఎలక్షన్‌ కమిషన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రేపేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News